కోవిడ్-19 : ప్రపంచవ్యాప్తంగా మృతుల సంఖ్య 25,000పైనే!
ABN , First Publish Date - 2020-03-28T03:36:10+05:30 IST
కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారితో ప్రపంచం తీవ్రంగా పోరాడుతోంది. దీనిని నిరోధించేందుకు అన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి.
న్యూఢిల్లీ : కరోనా వైరస్ (కోవిడ్-19) మహమ్మారితో ప్రపంచం తీవ్రంగా పోరాడుతోంది. దీనిని నిరోధించేందుకు అన్ని దేశాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలను కాపాడేందుకు వైద్యులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, ఇతర రంగాలవారు అహరహం శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్లు, మందులు, రోగ నిర్థరణ పరికరాలు కనుగొనేందుకు విస్తృతంగా కృషి జరుగుతోంది.
కోవిడ్-19 కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య శుక్రవారం నాటికి 25,000 పైనే కనిపిస్తోంది. ఈ ప్రాణాంతక వైరస్ 25,066 మందిని పొట్టనబెట్టుకుంది.
యూరోపు దేశాలు ఈ వైరస్ బారినపడి అతలాకుతలమవుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద యూరోపు ఖండంలో అత్యధిక మరణాలు సంభవించాయి. 17,314 మంది కరోనా వైరస్కు బలైపోయారు. ఈ వ్యాధి కారణంగా ప్రపంచం మొత్తం మీద అత్యధికంగా ఇటలీలో మరణించారు. 8,165 మంది ఇటలీవారు కోవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాతి స్థానాల్లో స్పెయిన్ (4,858), చైనా (3,292) ఉన్నాయి.
డిసెంబరు నుంచి ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 5,47,034 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు తెలిపిన సమాచారం ప్రకారం మన దేశంలో శుక్రవారంనాటికి నిర్థరణ అయిన కరోనా వైరస్ కేసులు 871 కాగా, 21 మంది మరణించారు.