జూలై తొలి పక్షానికల్లా కరోనా నియంత్రణ: బీఎంసీ కమిషనర్
ABN , First Publish Date - 2020-06-23T11:37:32+05:30 IST
మహానగరం ముంబై కరోనా వైరస్తో అతలాకుతలమవుతున్న విషయం విదితమే. అయితే జూలై మధ్యనాటికల్లా ముంబైలో కరోనాపై పూర్తి నియంత్రణ...

ముంబై: మహానగరం ముంబై కరోనా వైరస్తో అతలాకుతలమవుతున్న విషయం విదితమే. అయితే జూలై మధ్యనాటికల్లా ముంబైలో కరోనాపై పూర్తి నియంత్రణ వస్తుందని బీఎంసీ కమిషనర్ ఐఎస్ చాహల్ తెలిపారు. ప్రస్తుతం ముంబైలోని వర్లి, ధారావి, బైకుల్లా, డియోనార్, గోవాండి, బగన్వాడి తదితర హాట్స్పాట్ ప్రాంతాల్లో కరోనా పరిస్థితి అదుపులో ఉందని పేర్కొన్నారు. ఆసుపత్రి పడకలు, అంబులెన్సులు, వైద్యులు, వైద్య సిబ్బంది, కోవిడ్ కేర్ సెంటర్ల సౌకర్యాలు విస్తృతంగా పెరగడంతో రోగులందరికీ చికిత్స అందించడం మరింత సులభమవుతున్నదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం చూస్తే, జూలై మధ్య నాటికి ముంబైలో కరోనా పూర్తి నియంత్రణలోకి వస్తుందన్నారు. రాపిడ్ యాక్షన్ ప్లాన్ కింద ముంబైలో మిషన్ జీరో ప్రారంభమయ్యిందన్నారు. దీనిలో భాగంగా టెస్టింగ్, ట్రాకింగ్, క్వారంటైన్, చికిత్స మొదలైనవి విస్తృతంగా చేస్తున్నామన్నారు. దీని ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, త్వరలోనే కరోనాను తరిమి కొడతామని అన్నారు.