ఆసుపత్రిలో చేరిన 48 గంటల్లోనే 28 మంది కరోనా బాధితులు మృతి!
ABN , First Publish Date - 2020-06-22T16:03:18+05:30 IST
కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న యూపీలోని ఆగ్రా జిల్లాలో అధికారులను మరింతగా కలవరానికి గురిచేసే ఘటన చోటుచేసుకుంది. ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో కరోనా చికిత్స కోసం చేరిన...

ఆగ్రా: కరోనా వైరస్ విపరీతంగా వ్యాప్తి చెందుతున్న యూపీలోని ఆగ్రా జిల్లాలో అధికారులను మరింతగా కలవరానికి గురిచేసే ఘటన చోటుచేసుకుంది. ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో కరోనా చికిత్స కోసం చేరిన 28 కరోనా రోగులు... వారు చేరిన 48 గంటల్లోనే మృతిచెందారు. ఈ ఉదంతంపై యోగి సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు వెంటనే దర్యాప్తు కోసం ఆదేశాలు జారీ చేసింది. యూపీలోని ఆగ్రా ఆ రాష్ట్రంలోనే కరోనాకు అత్యధికంగా ప్రభావితమైన జిల్లాగా మారింది. ఇక్కడ ఇప్పటివరకు మొత్తం 75 మంది కరోనా బాధితులు మృతిచెందారు. ఇది యూపీలో అత్యధికం. ఆగ్రాలో కరోనా నియంత్రణ కోసం నోడల్ అధికారిగా విద్యుత్శాఖ కార్యదర్శి ఎం దేవరాజ్ను నియమించారు. కాగా పరిస్థితి విషమంగా మారిన తరువాత కరోనా బాధితులను ఆసుపత్రికి తీసుకువచ్చారని, చికిత్స అందించేందుకు అప్పటికే ఆలస్యం అయ్యిందని ఆగ్రా సీఎంవో ఆర్సీ పాండే తెలిపారు. ఆసుపత్రి వైద్యులు రోగులకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆగ్రాలో చోటుచేసుకున్న మరణాల్లో 85 శాతం 50 ఏళ్లు పైబడినవారివేనని ఆరోగ్య శాఖ చెబుతోంది. అలాగే వారికి డయాబెటిస్, గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు కూడా ఉన్నాయని తెలిపింది.