కరోనాపై పోరులోకి ఐఐటీలు
ABN , First Publish Date - 2020-04-01T08:20:09+05:30 IST
కరోనాపై భారత్ చేస్తున్న పోరాటంలో ఐఐటీలు కూడా కీలక భాగస్వాములుగా మారాయని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ రామగోపాల్ రావు పేర్కొన్నారు. కరోనా వైర్సపై పరీక్షలు...

న్యూఢిల్లీ, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): కరోనాపై భారత్ చేస్తున్న పోరాటంలో ఐఐటీలు కూడా కీలక భాగస్వాములుగా మారాయని ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ ప్రొఫెసర్ రామగోపాల్ రావు పేర్కొన్నారు. కరోనా వైర్సపై పరీక్షలు చేయడమే కాక, దాన్ని తట్టుకుని పరికరాలను, దుస్తులను రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ప్రస్తుతం తమ ప్రతిపాదనలు కేంద్ర మానవ వనరుల శాఖతో చర్చల దశలో ఉన్నట్లు ఆయన ‘ఆంధ్రజ్యోతి’ ఢిల్లీ ప్రతినిధికి వెల్లడించారు. ఫెబియోసిస్ ఇన్నోవేషన్స్ అనే స్టార్టప్ సంస్థను సంస్థలోని ఆచార్యులు, విద్యార్థులు కలిసి ప్రారంభించామని.. కేవలం రెండే గంటల్లో 99.99శాతం బాక్టీరియాను రూపుమాపే వస్త్రాన్ని ఈ సంస్థ తయారు చేస్తోందని ఆయన వివరించారు. ఐఐటి-గౌహతి డాక్టర్లకు, నర్సులకు వ్యక్తిగత రక్షణ ఉపకరణాలను రూపొందించేందుకు ముందుకు వచ్చిందని, ఐఐటి కాన్పూర్ అయితే తక్కువ ఖర్చుతో (రూ.70 వేలు) కూడిన వెంటిలేటర్లను రూపొందించిందని ఆయన గుర్తు చేశారు. ఐఐటి-హైదరాబాద్ వెంటిలేటర్లకు ప్రత్యామ్నాయంగా ఒక బ్యాగ్ వాల్వ్ తో కూడిన మాస్కు ను రూపొందించిందని, ఐఐటి ముంబై కోవిడ్ పేషంట్లను, కేసులను కనిపెట్టే యాప్ను రూపొందించిందని ఆయన తెలిపారు.