మురుగునీటిలో కరోనా జన్యుపదార్థం!!
ABN , First Publish Date - 2020-06-23T07:44:31+05:30 IST
కరోనాపై పోరులో భారత శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. దేశంలోనే తొలిసారిగా గుజరాత్లోని ఐఐటీ గాంధీనగర్ శాస్త్రవేత్తలు మురుగునీటిలో కరోనా జాడపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి...

- గుర్తించిన ఐఐటీ గాంధీనగర్ శాస్త్రవేత్తలు
న్యూఢిల్లీ, జూన్ 22: కరోనాపై పోరులో భారత శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు. దేశంలోనే తొలిసారిగా గుజరాత్లోని ఐఐటీ గాంధీనగర్ శాస్త్రవేత్తలు మురుగునీటిలో కరోనా జాడపై జరిపిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. కొవిడ్ మహమ్మారితో వణికిపోతున్న అహ్మదాబాద్ నగరంలోని మురుగు నీటిలోనూ కరోనా జన్యు పదార్థం ఆనవాళ్లను గుర్తించినట్లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మనీశ్ కుమార్ వెల్లడించారు. గుజరాత్ బయోటెక్నాలజీ రిసెర్చ్ సెంటర్(జీబీఆర్సీ), గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(జీపీసీబీ)ల సంయుక్త భాగస్వామ్యంతో ఐఐటీ గాంధీనగర్ ఈ విషయాన్ని తెలుసుకోగలిగిందన్నారు. అహ్మదాబాద్లోని ఓల్డ్ పిరానా మురుగు శుద్ధి ప్లాంట్ నుంచి మే 8, 27 తేదీల్లో శాంపిళ్లను సేకరించి ఆర్టీ-క్యూపీసీఆర్ పరిజ్ఞానంతో పరీక్షించగా వాటిలో మూడు రకాల(ఓఆర్ఎ్ఫ1ఏబీ, ఎన్, ఎస్) కరోనా జన్యు పదార్ధాలు ఉన్నట్లు తేటతెల్లమైందని మనీశ్ పేర్కొన్నారు. కరోనా జన్యుపదార్థం మోతాదు మే 8న సేకరించిన శాంపిళ్ల కంటే 27న పరీక్షించిన శాంపిళ్లలో 10 రెట్లు ఎక్కువగా ఉందని గుర్తించామన్నారు. అహ్మదాబాద్లో కరోనా కేసులు కూడా మే 8తో పోల్చితే మే 27న రెండు రెట్లు ఎక్కువగా ఉన్నాయని వివరించారు. దీన్నిబట్టి మురుగులోని కరోనా జన్యుపదార్థాల మోతాదుకు, కేసుల సంఖ్యకు అవినాభావ సంబంధం ఉందనే అంచనాకు వచ్చామన్నారు. దీంతో ‘మురుగునీటి ద్వారా సాంక్రమిక వ్యాధుల వ్యాప్తి’(డబ్ల్యూబీఈ) పద్ధతిని వినియోగిస్తున్న అతికొద్ది దేశాల జాబితాలో భారత్ చేరిందని మనీశ్ అన్నారు.