‘10 మంది కన్నా తక్కువగా పని చేసే నిర్మాణ కార్యక్రమాలకు అనుమతి అక్కర్లేదు’
ABN , First Publish Date - 2020-04-27T02:31:24+05:30 IST
కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధం కోసం అమలవుతున్న అష్ట

చండీగఢ్ : కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధం కోసం అమలవుతున్న అష్ట దిగ్బంధనం సమయంలో భవన నిర్మాణ కార్యకలాపాలకు హర్యానా ప్రభుత్వం పాక్షికంగా అవకాశం కల్పించింది. 10 మంది వరకు పని చేసే నివాస, పారిశ్రామిక నిర్మాణాల కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చునని ఆదివారం ప్రకటించింది. హర్యానాలోని పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలు, గ్రామీణ ప్రాంతాల్లో 10 మంది వరకు పనిచేసే చోట నిర్మాణాలకు అనుమతులు తీసుకోవలసిన అవసరం లేదని తెలిపింది.
దీనికి సంబంధించిన ఉత్తర్వులను హర్యానా కార్మిక శాఖ జారీ చేసింది. అన్ని పరిపాలనా శాఖల కార్యదర్శులు, డివిజినల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లకు ఈ ఉత్తర్వులను పంపించింది. ఆయా ప్రదేశాల్లో 10 మంది వరకు కార్మికులు అందుబాటులో ఉంటే, కార్మికులను బయటి నుంచి తీసుకురావలసిన అవసరం లేనట్లయితే, నిర్మాణ కార్యకలాపాలను కొనసాగించవచ్చునని తెలిపింది.
ఈ ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణ కార్యకలాపాలను జిల్లా కలెక్టర్లు పర్యవేక్షిస్తారని తెలిపింది.