మహారాష్ట్రను బద్నాం చేసే కుట్ర
ABN , First Publish Date - 2020-09-14T07:19:55+05:30 IST
మహారాష్ట్రను అపఖ్యాతిపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని శివసేన చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు.
రాజకీయ తుపాన్లను ఎదుర్కొంటా: ఠాక్రే
ముంబయిని అవమానపరిచిన కంగనాను బీజేపీ వెనకేసుకు రావడమేంటి?: సంజయ్
ముంబయి, సెప్టెంబరు 13: మహారాష్ట్రను అపఖ్యాతిపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని శివసేన చీఫ్, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే అన్నారు. అయితే ఎన్ని రాజకీయ తుపాన్లు వచ్చినా తాను ఎదుర్కోగలనని, కరోనా వైర్సతోనూ పోరాడగలనని చెప్పారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులో శనివారం 10 లక్షలు దాటడం, మరోవైపు సినీనటి కంగనా రనౌత్ భవనం కూల్చివేత, నటుడు సుశాంత్సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కేసును ప్రభుత్వం సరైన విధంగా హ్యాండిల్ చేయలేదంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఉద్ధవ్ మాట్లాడారు. రాజకీయాల గురించి మాట్లాడాలంటే తాను ముఖ్యమంత్రి మాస్క్ను తొలగించాల్సి ఉంటుందన్నారు. తాను ఏమీ మాట్లాడటం లేదంటే తన వద్ద సమాధానం లేనట్లు కాదని వ్యాఖ్యానించారు.
మరోవైపు ముంబయిని అవమానపరిచిన కంగనా రనౌత్ను బీజేపీ వెనకేసుకు రావడం దురదృష్టకరమని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ముంబయిని పాక్ ఆక్రమిత కశ్మీర్తో పోల్చినా.. బిహార్ ఎన్నికల్లో రాజ్పుత్లు, క్షత్రియుల ఓట్ల కోసం బీజేపీ ఆమెను వెనకేసుకొస్తోందని శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో ఆయన ఆరోపించారు. ముంబయి ప్రాధాన్యాన్ని తగ్గించేందుకు, అపఖ్యాతిపాలు చేసేందుకు పథకం ప్రకారం కుట్ర జరుగుతోందని పేర్కొన్నారు. దీనిపై మహారాష్ట్రకు చెందిన బీజేపీ నాయకులు ఒక్కరూ స్పందించడం లేదని విమర్శించారు.