వలస కూలీలకు సహాయపడేందుకు సైన్యాన్ని పిలవండి : కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-05-10T23:54:07+05:30 IST

నోవల్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల్లో

వలస కూలీలకు సహాయపడేందుకు సైన్యాన్ని పిలవండి : కాంగ్రెస్

న్యూఢిల్లీ : నోవల్ కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఏర్పడిన సంక్షోభ పరిస్థితుల్లో వలస కూలీలకు సహాయపడేందుకు కేబినెట్ మంత్రి నేతృత్వంలో మల్టీ నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వేలాది మంది వలస కూలీలు అష్ట కష్టాలు పడుతూ నడుచుకుంటూ ప్రయాణిస్తున్న నేపథ్యంలో ఈ డిమాండ్ చేసింది.


అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) కోశాధికారి, ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి అత్యంత సన్నిహితుడు అహ్మద్ పటేల్ మాట్లాడుతూ, వలస కూలీలకు సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు కేబినెట్ మంత్రి నేతృత్వంలో మల్టీ నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. 


ఈ మానవీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు అవసరమైతే సైనిక దళాల సహకారం కూడా తీసుకోవాలన్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ ఈ సమస్యను పరిష్కరించలేకపోతోందన్న విషయం స్పష్టమవుతోందన్నారు. 


వలస కూలీలు తమ స్వస్థలాలకు వెళ్ళేందుకు రైలు టిక్కెట్ ఛార్జీలను కాంగ్రెస్ భరిస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆమె పిలుపుతో ఆ పార్టీ రాష్ట్ర శాఖలు కూడా వలస కూలీలకు సహాయపడేందుకు ముందుకు వస్తున్నాయి. 



Updated Date - 2020-05-10T23:54:07+05:30 IST