చర్చలకు రండి
ABN , First Publish Date - 2020-12-11T09:15:15+05:30 IST
ఆందోళన చేస్తున్న రైతులతో మరో దఫా చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. తమ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని, ఏ అంశంలో అభ్యంతరమున్నా పరిష్కరించేందుకు సిద్ధంగా
అభ్యంతరాలు తీర్చేందుకు రెడీ: కేంద్రం
ఇక రైళ్ల రాకపోకలనూ అడ్డుకుంటాం: రైతు నేతలు
న్యూఢిల్లీ, డిసెంబరు 10: ఆందోళన చేస్తున్న రైతులతో మరో దఫా చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు కేంద్రం ప్రకటించింది. తమ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలించాలని, ఏ అంశంలో అభ్యంతరమున్నా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామ ని వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర తోమర్ గురువారం మీడియాకు చెప్పారు. ప్రభుత్వం చేసే ఏ చట్టమూ మొత్తంగా లోపభూయిష్టంగా ఉండదని, రైతులవి అపోహలేనని, వాటిని సవివరంగా చర్చించి లక్ష్యాలను వివరిస్తామన్నారు. బుధవారం జరగాల్సిన ఆరో రౌండు చర్చలు రద్దయిన సంగతి తెలిసిందే. కొత్త చట్టాల్లో 7 సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం రాతపూర్వకంగా ఓ పత్రాన్ని రైతులకు పంపింది. వాటిని తిరస్కరించిన రైతు సంఘాలు చట్టాల రద్దు మినహా వేరే మాటకు తావులేదని తేల్చిచెప్పారు.
చట్టాల రద్దు అసాధ్యమని తోమర్ కూడా స్పష్టం చేశారు. కొత్త చట్టాల వల్ల కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కు, ఏపీఎంసీ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడదని రైల్వే మంత్రి పీయూశ్ గోయల్ చెప్పారు. రెండు వారాలుగా రైతులు వణికించే చలిలో నిరసన కొనసాగించడం సరికాదని, కొవిడ్ ఉధృతి కూడా ఉన్నందున కేంద్ర ప్రతిపాదనలను వెంటనే పరిశీలించాలని తోమర్ కోరారు. తోమర్, గోయెల్ బుధవారంరాత్రి అమిత్ షాతో చర్చించారు. కాగా, ఇక రైలు పట్టాలను కూడా ఆక్రమించుకుని రైలు సర్వీసులను దిగ్బంధిస్తామని రైతు నేతలు హెచ్చరించారు. దిగ్బంధం ఎప్పటి నుంచి చేసేదీ సంయుక్త కిసాన్ మంచ్ త్వరలోనే ప్రకటిస్తుందని రైతు నేత బూటాసింగ్ చెప్పారు. డిసెంబరు 10 వరకూ ప్రధానికి గడువిచ్చామని, ఇక ఆగేది లేద న్నారు. రైతు క్షేమమే ముఖ్యమనుకుంటే ప్రస్తుత చట్టాలను రద్దు చేసి రైతు నేతలు, ఇతర మేధావి వర్గాలతో చర్చించి కొత్త బిల్లులు రూపొందించాలని సూ చించారు. వ్యవసాయం రాష్ట్ర జాబితాలోని అంశమని, దీనిపై కేంద్రం చట్టాలు ఎందుకు చే స్తోందని భారతీయ కిసాన్ యూనియన్ (ఆర్) నేత బల్బీర్సింగ్ రాజేవాల్ ప్రశ్నించారు. వ్యాపారుల కోసమే ఈ చట్టాలు చేసినట్లు కేంద్రం ఒప్పుకుందన్నారు.
బట్టలు ఉతికిన క్రీడాకారులు
ఆందోళన చేస్తున్న రైతులకు 12 మంది క్రీడాకారులు, మరో ఆరుగురు యువకులు అనూహ్య రీతిలో తోడ్పడుతున్నారు. 15-18 వాషింగ్ మెషీన్లు తెచ్చి మాసిపోయిన రైతుల బట్టలు ఉతికిపెట్టి సేవలందిస్తున్నారు. రైతులు బట్టలను శుభ్రం చేసుకోవడానికి సొంతూరు వెళ్లా ల్సిన అవసరం లేకుండా తామే ఈ పను చేస్తున్నట్లు జగ్జీత్ సింగ్ చెప్పాడు.
రైతు ఆందోళన వెనుక చైనా-పాక్: కేంద్ర మంత్రి
రైతుల ఆందోళన వెనుక చైనా పాకిస్థాన్ల హస్తముందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయమంత్రి రావుసాహెబ్ దన్వీ అన్నారు. ‘తొలుత ముస్లింలను రెచ్చగొట్టారు. సీఏఏ, ఎన్నార్సీ వస్తే ముస్లింలందరినీ దేశం నుంచి వెళ్లగొడతారని ప్రచారం జరిగింది. ఒక్క ముస్లిమైనా దేశం విడిచి వెళ్లాడా? ఢిల్లీ శివార్లలో ఆందోళన రైతులది కాదు. చైనా, పాక్ల ప్రేరేపితం’ అన్నారు. ఈ వ్యాఖ్యలపై సిక్కు కమిటీలు నిరసన వ్యక్తం చేశాయి. అదే నిజమైతే చైనా, పాక్లపై సర్జికల్ దాడులు చేయాలని శివసేన ఎద్దేవా చేసింది.
హక్కుల నేతల విడుదలకు డిమాండ్
గురువారం మానవహక్కుల దినం సందర్భంగా రైతు సంఘా ల్లో పెద్దదైన భారతీయ కిసాన్ యూనియన్(ఏక్తా ఉగ్రహాన్).. జైల్లో మగ్గుతున్న మానవహక్కుల నేతలను విడుదల చేయాలని డిమాండ్ చేసింది. విప్లవకవి వరవరరావు, గౌతమ్ నవ్లఖా, సుధా భరద్వాజ్, ఆనంద్ టెల్టుంబ్డే సహా ఎల్గార్ పరిషత్ కేసులో అరెస్టు చేసిన మేదావులను, ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులుగా ముద్రపడ్డ ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్, ఖాలిద్ సైఫీలను, జైల్లో ఉన్న ఇత ర మేధావులను విడుదల చేయాలని పోస్టర్లను ప్రదర్శించారు.