ఇంట్లోనే నమాజ్‌కు ముస్లిం పెద్దల పిలుపు

ABN , First Publish Date - 2020-03-27T21:48:36+05:30 IST

దేశంలో లాక్‌డౌన్ కొనసాగినంత కాలం ముస్లిం సోదరులు నమాజ్‌లు (శుక్రవారం ప్రార్థనలు) తమ తమ ఇళ్లలోనే నమాజ్‌లు చేసుకోవాలని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ..

ఇంట్లోనే నమాజ్‌కు ముస్లిం పెద్దల పిలుపు

న్యూఢిల్లీ: దేశంలో లాక్‌డౌన్ కొనసాగినంత కాలం ముస్లిం సోదరులు నమాజ్‌లు (శుక్రవారం ప్రార్థనలు) తమ తమ ఇళ్లలోనే చేసుకోవాలని ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇమామ్ ఉమర్ అహ్మద్ ఇల్యాసి పిలుపునిచ్చారు. 


'సామాజిక దూరం పాటించడం మినహా ఇంతవరకూ కరోనా వైరస్‌ నుంచి బయటపడటానికి మరో మార్గం లేదు. వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు లాక్‌డౌన్ పాటించాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన ఆదేశాలను ముస్లిం సోదరులు, ఇమామ్‌లు పాటించాలని కోరుతున్నాను' అని ఇల్యాసి శుక్రవారంనాడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.


నమాజ్ పాటించడం ముస్లిం సోదరుల విధి అని, మసీదులో జరపడం సున్నియత్ అని, అయితే మన ప్రాణాలను కాపాడుకుంటూ ఇతరుల ప్రాణాలను కూడా కాపాడటం కూడా మన విద్యుక్తధర్మమని ఇల్యాసి చెప్పారు. లాక్‌డౌన్ నేపథ్యంలో భక్తులకు ప్రవేశం లేకుండా డోర్లు మూసే ఉంచాలని దేశంలోని 5 లక్షల మసీదుల ఇమామ్‌లకు ఆదేశాలిచ్చినట్టు ఆయన చెప్పారు.


కాగా, ముస్లింలు తమ ఇళ్లలోనే నమాజు చేసుకునేందుకు షరియత్ అనుమతిస్తుందని ఫతేపూర్ మసీదు షాహి ఇమామ్ ముఫ్తి ముకర్రం తెలిపారు. దీనికి ముందు, ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) సైతం కరోనా వైరస్ వ్యాప్తి  దృష్ట్యా జోహర్ ప్రార్థనలు మసీదుల్లో కాకుండా ఇళ్లలోనే చేసుకోవాలని ముస్లిం సోదరులకు పిలుపునిచ్చింది.

Updated Date - 2020-03-27T21:48:36+05:30 IST