మాపై దుష్ప్రచారాలు ఆపండి

ABN , First Publish Date - 2020-12-27T09:30:00+05:30 IST

ప్రభుత్వంతో మళ్లీ చర్చలు జరపాలని రైతులు నిర్ణయించారు. ఈ నెల 29వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది.

మాపై దుష్ప్రచారాలు ఆపండి

ఉద్యమంపైనా, మాపైనా బురద చల్లొద్దు

కేంద్ర ప్రభుత్వానికి రైతుల స్పష్టీకరణ, లేఖ

చట్టాల రద్దుపై వెనక్కి తగ్గలేదని స్పష్టీకరణ

మరోసారి చర్చలకు సుముఖత


ఎన్డీయేకు రాజస్థాన్‌ బీజేపీ మిత్రపక్షం రాంరాం

రైతు చట్టాల విషయంలో మొండివైఖరి అవలంబిస్తున్నారని నిరసిస్తూ రాజస్థాన్‌లో బీజేపీ మిత్రపక్షం-  రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ ఎన్డీయే నుంచి వైదొలిగింది. ‘మేమేమీ ఎన్డీయేకు ఫెవికాల్‌ మాదిరిగా అతుక్కుపోయి లేము. రైతులకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయపక్షంతో కలిసి ప్రయాణించలేం...అందుకే నిష్క్రమించాం’ అని ఆరెల్పీ నేత, నాగౌర్‌ ఎంపీ హనుమాన్‌ బేణీవాల్‌ షాజహాన్‌పూర్‌ సరిహద్దువద్ద రైతు సభలో అన్నారు. అకాలీదళ్‌ తరువాత ఇదే కారణంపై బీజేపీకి రాంరాం చెప్పిన పార్టీ ఆరెల్పీయే!


న్యూఢిల్లీ, డిసెంబరు 26: ప్రభుత్వంతో మళ్లీ చర్చలు జరపాలని రైతులు నిర్ణయించారు. ఈ నెల 29వ తేదీ మంగళవారం ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ మేరకు రైతు సంఘాలు వ్యవసాయ శాఖ కార్యదర్శి వివేక్‌ అగర్వాల్‌కు లేఖ పంపాయి. చట్టాల రద్దు, ఎమ్మెస్పీకి చట్టబద్ధత ఈ చర్చల్లో ఉండి తీరాలని అందులో షరతు విధించారు. శనివారంనాడు సింఘూ సరిహద్దు పాయింట్‌ వద్ద సమావేశమైన 40 యూనియన్ల ప్రతినిధులు ప్రభుత్వం రెండ్రోజుల కిందట రాసిన లేఖపైనా, ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ఇచ్చిన పిలుపుపైనా చర్చించారు.


అసలు మీ అభ్యంతరాలేంటో, ఏఏ అంశాలను వ్యతిరేకిస్తున్నారో తెలియజేయండంటూ వివేక్‌ అగర్వాల్‌ రాయడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి. ‘ఇప్పటిదాకా ఐదు రౌండ్ల చర్చలు జరిగాయి. ప్రతీ సారీ మంత్రులకు, అధికారులకూ చెబుతునేన్నాం... ఆ చట్టాల రద్దే మా ప్రధాన డిమాండ్‌ అని! కానీ దురదృష్టవశాత్తూ మీ లేఖ గత సమావేశాల్లో జరిగిన విషయాన్ని దాచిపెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. మా వైఖరిని వక్రీకరించి మేమేదో సవరణలు కోరుతున్నట్లు మీ లేఖ వివరిస్తోంది. ఇలాంటి దుష్ప్రచారాలు ఆపండి. రైతులపై ప్రతికూల ప్రచారాలు వద్దు. నిజంగా మా అభిప్రాయాలను గౌరవప్రదంగా మీరు వినదలిస్తే రైతుల ఉద్యమాన్ని, అన్నదాతలపై బురద జల్లడాన్ని ప్రభుత్వ యంత్రాంగం తక్షణం ఆపాలి’ అని 40 యూనియన్ల ఐక్య వేదిక- సంయుక్త కిసాన్‌ మోర్చా  ఆ లేఖలో సూటిగా స్పష్టం చేసింది. 


ఇదీ ఎజెండా

29న జరపబోయే చర్చల ఎజెండాలో ప్రధానంగా నాలుగు అంశాలు ఉండాలని మోర్చా తేల్చిచెప్పింది. అవి: 3 సాగు చట్టాల రద్దు కోసం చేపట్టాల్సిన విధివిధానాలు జాతీయ రైతు కమిషన్‌ సిఫారసు చేసిన ఎమ్మెస్పీకి చట్టబద్ధమైన గ్యారంటీ కలుగజేసే విధివిధానం ఖరారు ఢిల్లీ, దానికి ఆనుకుని ఉన్న ప్రదేశాల్లో వాయు కాలుష్య నిరోధానికి సంబంధించిన ఆర్టినెన్స్‌లో శిక్షార్హమైన నిబంధనల పరిధి నుంచి రైతులను మినహాయించేలా సవరణలు విద్యుత్తు సవరణల బిల్లు- 2020లో రైతుల ప్రయోజనాలు కాపాడేట్లు మార్పులు తేవడం. వీటిలో మొదటి రెండింటినీ కేంద్రం ఇప్పటికే అనేకసార్లు తిరస్కరిస్తూ వచ్చింది. ఎంఎస్పీకి చట్టబద్ధత చేకూర్చడం అసాధ్యమని, అది పాలనాసంబంధమైన అంశమని, ఇక చట్టాల రద్దు అసాధ్యమని మోదీ  ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. సవరణలకు మాత్రమే సంసిద్ధత చూపింది. ఈ తరుణంలో మళ్లీ చర్చలు జరిగినా అవి ఎంతవరకూ ఫలవంతం అవుతాయన్నది అనుమానమేనని రైతు సంఘాలే అంటున్నాయి. చర్చలకు పిలుస్తున్నా వెళ్లకపోతే అది తమ తప్పు అవుతుందని, అందుకే ఎజెండాను సైతం మొదలే ఖరారు చేసి ఇస్తున్నామని మోర్చా నేత దర్శన్‌పాల్‌ వివరించారు.  గడచిన నెల రోజులుగా ఢిల్లీ పొలిమేరల్లో ఆందోళన చేస్తున్న వేల మంది రైతులకు తోడుగా పంజాబ్‌, మహారాష్ట్రల నుంచి పెద్ద సంఖ్యలో అన్నదాతలు తాజాగా వచ్చి చేరారు. వీరే కాక పంజాబ్‌లోని తరన్‌ తారన్‌, భటిండా, అమృత్‌సర్‌, గురుదా్‌సపూర్‌ల నుంచి అనేకమంది రైతులు ట్రాక్టర్లు, ట్రాలీల్లో ఆహార దినుసులు, ఇతర నిత్యావసరాలు, టెంట్లు వేసుకుని ఢిల్లీ దిశగా బయలుదేరారు. మహారాష్ట్రలోని నాసిక్‌, నాగ్‌పూర్‌ సహా 21 జిల్లాల నుంచి వందలాది మంది రైతులు ఆలిండియా కిసాన్‌ సభ నేతృత్వంలో ఢిల్లీకి చేరుకున్నారు. 


ఇంటికి రండి.. చట్టాల గురించి చెబుతా

ప్రభుత్వం చేసిన సాగు చట్టాల గురించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు అర్థమైనట్లు లేదని,  తన నివాసానికి వస్తే వాటి గురించి విడమర్చి చెబుతానని బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ ఆహ్వానించారు. కేజ్రీవాల్‌ ఎవరినీ తన సొంత ఇంట్లోకి అడుగుపెట్టనివ్వరని, తాను మాత్రం ఆయనను రమ్మని ఆహ్వానిస్తున్నానని తివారీ చెప్పారు. చట్టాలు రైతులకు మేలు కంటే కీడే ఎక్కువ చేస్తాయని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించడంతో తివారీ ఈ ప్రతిపాదన చేశారు. ఇక అన్ని అంశాలపైనా రైతులతో చర్చలకు సిద్ధమంటూ మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలను నమ్మలేమని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ‘ఏకపక్షంగా బిల్లులను ఆమోదింపజేసుకున్న మోదీ సర్కారు ఇపుడు చర్చల్లో అన్నీ పరిష్కరిస్తామని చెబితే నమ్మశక్యం కాదు’ అని ఆయన పేర్కొన్నారు.


రైతు నేత తికాయత్‌కు బెదిరింపులు

కొత్త వ్యవసాయ చట్టాల వ్యతిరేక ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న భారతీయ కిసాన్‌ యూనియన్‌ (బీకేయూ) నేత రాకేష్‌ తికాయత్‌కు ఓ వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరించాడు. శనివారం సాయంత్రం ఫోన్‌ చేసిన గుర్తుతెలియని వ్యక్తి చంపేస్తామంటూ హెచ్చరించాడు. దీనిపై తికాయత్‌ వ్యక్తిగత సహాయకుడు అర్జున్‌ బలియాన్‌ ఫిర్యాదు మేరకు కౌశంబి పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఫోన్‌ నంబరును కూడా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. బెదిరింపుల నేపథ్యంలో ఢిల్లీ శివారు ఘాజీపూర్‌ రైతు నిరసన శిబిరం వద్ద పోలీసు బందోబస్తును పెంచారు.


కాంగ్రె్‌సవాదుల్లారా.. నిద్రలేవండి: డిగ్గీ రాజా

పంజాబ్‌, హరియాణ, యూపీ, ఉత్తరాఖండ్‌ల నుంచి లక్షల మంది రైతులు నెలరోజులుగా ఆందోళన చేస్తున్నారు. కాంగ్రె్‌సవాదులు నిద్ర లేవాలి. ఈ ఆందోళనతో శ్రుతి కలపాలి. రైతు పక్షాన పోరాడాలి’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని, దీనిని కాంగ్రె్‌సవాదులు అడ్డుకోవాలని ఆయన కోరారు. అటు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ కూడా- ప్రధాని రైతుల మాట ఆలకించాలని కోరారు. ఆందోళనకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. 


నినాదాలతో గాలి పటాలు

సింఘూ, టిక్రీ సరిహద్దు పాయింట్ల వద్ద నిరసన చేస్తున్న యువ రైతులు తమ నినాదాలు, డిమాండ్లతో కూడిన గాలిపటాలను తయారుచేసి వాటిని ఎగరేశారు. ‘రైతు లేనిదే ఆహారం లేదు... రైతు లేనిదే బతుకే లేదు, మేం రైతులం... ఉగ్రవాదులం కాదు... అని నినాదాలు రాసిన గాలిపటాలు ఎగరేశారు. కొందరు ఫేస్‌బుక్‌, ట్విటర్‌లలో ఈ ఆందోళన సాగుతున్న క్రమం, ఓ మేళా మాదిరిగా జరుగుతున్న తీరును వివరిస్తూ వివిధ కార్యక్రమాలను లైవ్‌స్ట్రీమ్‌ చేస్తున్నారు.

Updated Date - 2020-12-27T09:30:00+05:30 IST