బరాక్ ఒబామాపై యూపీలో కేసు ఫైల్

ABN , First Publish Date - 2020-11-19T21:24:56+05:30 IST

ఒబామా రాసుకున్న ‘ది ప్రామిస్డ్ లాండ్’ అనే పుస్తకంలో మన్మోహన్, రాహుల్ గురించి ప్రస్తావించారు. రాహుల్‌కు ఇబ్బంది లేకుండా ఉండేందుకే మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా సోనియా గాంధీ ఎంచుకున్నారని అన్నారు. మన్మోహన్‌ అసాధారణ మేధావి..

బరాక్ ఒబామాపై యూపీలో కేసు ఫైల్

న్యూఢిల్లీ: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ఉత్తరప్రదేశ్‌లోని లాల్‌గంజ్ సివిల్ కోర్టులో సివిల్ సూట్ దాఖలైంది. భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌పై, కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీపై ఒబామా చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని, వారిద్దరికి ఉన్న లక్షల మంది ఫాలోవర్లను మనోభావాలను దెబ్బ తీసేవిగా ఉన్నాయని ఆల్ ఇండియా రూరల్ బార్ అసోసియేషన్ జాతీయ అధక్షుడు గ్యాన్ ప్రకాష్ శుక్లా ఈ సూట్ దాఖలు చేశారు. అంతే కాకుండా దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


ఒబామా రాసుకున్న ‘ది ప్రామిస్డ్ లాండ్’ అనే పుస్తకంలో మన్మోహన్, రాహుల్ గురించి ప్రస్తావించారు. రాహుల్‌కు ఇబ్బంది లేకుండా ఉండేందుకే మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా సోనియా గాంధీ ఎంచుకున్నారని అన్నారు. మన్మోహన్‌ అసాధారణ మేధావి అని, అయితే తన పదవి సోనియాకు రుణపడి ఉందని చెప్పుకొచ్చారు. ఇక రాహుల్ గాంధీ గురించి ప్రస్తావిస్తూ అంతగా ప్రతిభలేని, నిరాశవాదుడని.. తన కోర్సు పూర్తి చేయకుండా ఉపాధ్యాయుల ప్రశంసల కోసం ఎదురుచూసే విద్యార్థి లాంటి వారని రాసుకొచ్చారు.


కాగా దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యమ్ ఠాగూర్ అయితే ఏకంగా ఒబామాను ట్విట్టర్‌లో అన్‌-ఫాలో చేసినట్లు ప్రకటించారు. ఇదే విషయమై గ్యాన్ ప్రకాష్ శుక్లా, తాజాగా కోర్టులో సివిల్ సూట్ దాఖలు చేశారు. భారత రాజకీయ నేతలపై ఆరోపణలు చేయడం దేశ సౌభ్రతృత్వంపై దాడి చేయడమేనని ఆయన అన్నారు. ఒబామాపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయకపోతే తాను అమెరికా ఎంబసీ తలుపు తడతానని ప్రకాష్ శుక్లా తెలిపారు.

Updated Date - 2020-11-19T21:24:56+05:30 IST