కదం తొక్కిన రైతన్న

ABN , First Publish Date - 2020-11-27T07:18:06+05:30 IST

కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా నివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు దేశ రాజధానిని చుట్టుముట్టారు. కొవిడ్‌ కారణంగా ఢిల్లీలో ర్యాలీలకు అనుమతి లేదని ప్రభుత్వం చెప్పినప్పటికీ అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీతో పాటు భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన

కదం తొక్కిన రైతన్న

‘చలో ఢిల్లీ’ ఉద్రిక్తం. బారికేడ్లను ఛేదించి ముందుకు

లాఠీచార్జ్‌, బాష్పవాయు ప్రయోగం.. రైతుల పట్ల గౌరవంగా ఉండాలి: దేవెగౌడ

కేంద్రం క్రూరత్వానికి  ఇది పరాకాష్ట : రాహుల్‌.. రైతులతో చర్చలకు సిద్ధం: కేంద్రం


న్యూఢిల్లీ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి):  కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా నివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది రైతులు దేశ రాజధానిని చుట్టుముట్టారు. కొవిడ్‌ కారణంగా ఢిల్లీలో ర్యాలీలకు అనుమతి లేదని ప్రభుత్వం చెప్పినప్పటికీ  అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీతో పాటు భారతీయ కిసాన్‌ యూనియన్‌కు చెందిన వివిధ సంస్థలు ఇచ్చిన  ‘చలో ఢిల్లీ’ పిలుపు మేరకు అయిదు జాతీయ రహదారుల మీదుగా రైతులు రాజధాని వైపు కదిలారు. గజ గజ వణికించే చలిని కూడా వారు లెక్కచేయ లేదు.  కాగా, పంజాబ్‌,  హరియాణా, ఉత్తరప్రదేశ్‌, మఽఽధ్యప్రదేశ్‌, గుజరాత్‌ తదితర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి దారితీసే అన్ని రహదారులను పోలీసులు అష్టదిగ్బంధనం చేయడంతో రైతులు బ్యారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించారు.


వారిపై పోలీసులు లాఠీ చార్జీ చేశారు.  బాష్పవాయువును ప్రయోగించారు. యోగేంద్ర యాదవ్‌, మేధాపాట్కర్‌, ప్రతిభా షిండే, కవితా శ్రీనివాసన్‌ తదితర నేతలను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ఇది పంజాబ్‌ 26/11అని నిన్నటి వరకూ బిజెపి మిత్రపక్షంగా ఉన్న శిరోమణి అకాలీదళ్‌ నేత సుఖ్‌ బీర్‌ సింగ్‌ బాదల్‌ ప్రకటించారు. సోనీపేట సమీపంలోని కుండ్లి, సిర్హాల్‌, రాజోక్రి లోని ఢిల్లీ గురుగ్రామ్‌ సరిహద్దుల్లోనూ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రైతులు ట్రాక్టర్లలో ముందుకు కదులుతుండటంతో అనేక చోట్ల పోలీసులు ఇసుక బస్తాలను పేర్చారు. కాగా, ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద రైతులకు మద్దతుగా సిఐటీయు, ఏఐటీయూసితో సహా వివిధ కార్మిక, రైతాంగ సంఘాలు నిరసన ప్రదర్శనను నిర్వహించాయి.


అఖిల భారత కిసాన్‌ సంఘర్ష్‌ సమన్వయ కమిటీ జాతీయ కార్యవర్గ సభ్యులు హన్నన్‌ మొల్లా, సునీలం సత్యవాన, కురుగంటి కవిత, విస్సా కిరణ్‌ కుమార్‌, ప్రేమ్‌ సింగ్‌ గెహ్లాత్‌ తదితరులు ఢిల్లీలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మూడు లక్షలమంది రైతులు ఢిల్లీ పొలిమేరల్లో ఉన్నారని రైతు సంఘాల నాయకులు చెబుతున్నారు.  కనీస మద్దతు ధర(ఎంఎ్‌సపీ) విషయం లో రైతులకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని హరియాణా సీఎం ఎంఎల్‌ ఖట్టర్‌ స్పష్టం చేశారు. రైతులపై టియర్‌గ్యాస్‌ ప్రయోగించడాన్ని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ ఖండించారు. రైతులపై బీజేపీ సర్కారు నిర్బంధాన్ని సీపీఐ(ఎంఎల్‌)న్యూ డెమొక్రసీ  తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది.  


చర్చలకు సిద్ధం: కేంద్రం

నూతన వ్యవసాయ చట్టాలపై చర్చలకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం స్పష్టం చేసింది. రైతులు తమ ఆందోళనలను విరమించి డిసెంబరు 3న మరోసారి చర్చలకు రావాలని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి నరేంద్ర తోమర్‌ విజ్ఞప్తి చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు రైతులను తప్పుదారి పట్టించి ప్రయోజనం పొందాలని చూస్తున్నాయని ఆరోపించారు. 

Updated Date - 2020-11-27T07:18:06+05:30 IST