భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనా హెలికాప్టర్లు

ABN , First Publish Date - 2020-05-17T22:28:09+05:30 IST

హిమాచల్ ప్రదేశ్‌లోని లహుల్-స్పిటి జిల్లా ఎస్పీ రాజేష్ ధర్మాని సమాచారం ప్రకారం, ఏప్రిల్ 11, 20 తేదీల్లో చైనా హైలికాప్టర్లు ఆ జిల్లాలోకి ..

భారత భూభాగంలోకి చొచ్చుకొచ్చిన చైనా హెలికాప్టర్లు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ప్రజారోగ్యాన్ని హరించేందుకు చైనా కారణమంటూ అమెరికా చేసిన ఆరోపణలపై చైనా ప్రత్యారోపణలు గుప్పించడం, ఇటీవల ఎల్ఓసీ వెంబడి భారత బలగాలతో చైనా బలగాలు తలబడటం వంటి ఘటనల అనంతరం చైనా నిర్వాకానికి సంబంధించిన మరో ఘటన కూడా తాజాగా వెలుగు చూసింది. గగనతల నిబంధనలు ఉల్లంఘిస్తూ చైనా హెలికాప్టర్లు గత ఏప్రిల్‌లో రెండుసార్లు భారత భూభాగంలోకి చొచ్చుకువచ్చాయి.


హిమాచల్ ప్రదేశ్‌లోని లహుల్-స్పిటి జిల్లా ఎస్పీ రాజేష్ ధర్మాని సమాచారం ప్రకారం, ఏప్రిల్ 11, 20 తేదీల్లో చైనా హైలికాప్టర్లు ఆ జిల్లాలోకి అడుగుపెట్టాయి. ఏప్రిల్ 11న జిల్లాలోని సాంథో ప్రాంతంలోకి 12 నుంచి 15 కిలోమీటర్ల మేర చైనా హెలికాప్టర్ ఒకటి చొచ్చుకువచ్చింది. ఇదే ప్రాంతంలోనికి ఏప్రిల్ 20న మరోసారి ఒక హెలికాప్టర్ చొచ్చుకువచ్చింది. ఇందుకు సంబంధించిన నివేదికలను సీఐడీ, ఇతర ఇంటెలిజెన్స్ సంస్థలు ఉన్నతాధికారులకు అందజేశారు.


కాగా, భారత సరిహద్దుల్లోని నార్త్ సిక్కిం వద్ద గత శనివారంనాడు భారత్, చైనా బలగాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. భారత బలగాలు, పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తోపులాటలు, పిడిగుద్దులతో తలబడ్డాయి. ఈ ఘర్షణలో ఇరువైపులా పలువురు గాయపడ్డారు. ఉన్నతాధికారుల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగింది. తూర్పు లడఖ్‌లోని ప్యాంగాగ్ టీఎస్ఓ లేక్ వద్ద కూడా మే 5వ తేదీ రాత్రి కూడా ఇరు దేశాల బలగాల మధ్య ఈ తరహా ఘర్షణే చోటుచేసుకుంది.

Updated Date - 2020-05-17T22:28:09+05:30 IST