చైనాకు కొత్త తలనొప్పి!

ABN , First Publish Date - 2020-03-21T20:42:16+05:30 IST

చైనాకు కొత్త తలనొప్పి...స్థానికంగా వ్యాధి వ్యాప్తిని నిరోధించినా స్వదేశానికి తిరిగొస్తున్న చైనీయులు కరోనా బారిన పడుతున్నారు

చైనాకు కొత్త తలనొప్పి!

న్యూఢిల్లీ: కరోనాతో ప్రభావితమైన దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది.  81 వేలకు పైగా కరోనా కేసులు.. 3 వేలకు పైగా మరణాలతో ఆ దేశం అల్లాడిపోయింది. కానీ  ప్రభుత్వం పట్టుదలతో పోరాడి పరిస్థితిని అదుపులోకి తెచ్చింది. వ్యాధికి కేంద్రమైన వుహాన్‌తో పాటూ వివిధ నగరాల్లో అత్యంత కఠినమైన ఆంక్షలు విధించింది. దీంతో స్థానికంగా వ్యాధి వ్యాప్తి(లోకల్‌ ట్రాన్స్‌మిషన్) పూర్తిగా అదుపులోకి వచ్చింది. ఈ తరహా కేసులు గత మూడు రోజుల్లో ఒక్కటి కూడా నమోదు కాకపోవడమనేది చైనా పైచేయి సాధించిందనడానికి నిదర్శనం. అయితే తాజాగా చైనాకు మరో తలనొప్పి వచ్చిపడింది. ప్రస్తుతం విదేశాల నుంచి తిరిగి వస్తున్న చైనీయుల్లో కొందరు కరోనా బారిన పడుతున్నారు. ఇలా స్వదేశానికి తిరిగొచ్చిన వారిలో 41 మందికి కరోనా వైరస్ సోకినట్టు అక్కడి జాతీయ ఆరోగ్య కమిషన్ తాజాగా ప్రకటించింది. దీంతో చైనాలో ఈ రకమైన కేసుల సంఖ్య 269కి చేరుకుంది. వీటి సంఖ్య ప్రస్తుతం అదుపులోనే ఉన్నప్పటికీ.. ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు రంగంలోకి దిగిన ప్రభుత్వానికి ఈ ధోరణి ఓ తలనొప్పిగా మారింది.

Updated Date - 2020-03-21T20:42:16+05:30 IST