చైనా కారుకూతలు
ABN , First Publish Date - 2020-10-14T00:14:55+05:30 IST
చైనా ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. తూర్పు లడఖ్లో భారీగా సైన్యాన్ని మోహరించి, వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నించిన
న్యూఢిల్లీ : చైనా ఆగడాలకు అంతు లేకుండా పోతోంది. తూర్పు లడఖ్లో భారీగా సైన్యాన్ని మోహరించి, వాస్తవాధీన రేఖను ఏకపక్షంగా మార్చేందుకు ప్రయత్నించిన చైనా, తాజాగా లడఖ్ను కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించడం చట్టవిరుద్ధమని, భారత దేశంలో భాగాలుగా లడఖ్, అరుణాచల్ ప్రదేశ్లను గుర్తించేది లేదని చెప్తోంది.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సోమవారం సరిహద్దు ప్రాంతాల్లో 44 వంతెనలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, జమ్మూ-కశ్మీరులలో ఈ వంతెనలను నిర్మించారు. వీటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజ్నాథ్ ప్రారంభించారు. దీనిని కూడా చైనా ఖండించింది.
భారతీయ దళాలు అత్యంత వేగంగా ఆయుధాలను, దళాలను రవాణా చేసేందుకు ఈ వంతెనలు ఉపయోగపడతాయి. వీటికి వ్యూహాత్మక ప్రాధాన్యం చాలా ఉంది.
ఈ నేపథ్యంలో చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి ఝావో లిజియాన్ స్పందిస్తూ, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాన్ని చైనా గుర్తించబోదని చెప్పారు. దీనిని భారత దేశం చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిందన్నారు. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్ను కూడా గుర్తించేది లేదన్నారు. సరిహద్దు ప్రాంతం వెంబడి మౌలిక సదుపాయాల అభివృద్ధికి చైనా వ్యతిరేకమని పేర్కొన్నారు. పరిస్థితిని ఉద్రేకపరిచే ఎటువంటి చర్యలకు ఇరు పక్షాలు దిగకూడదన్నారు. అటువంటివి జరిగితే పరిస్థితిని చక్కదిద్దేందుకు జరుగుతున్న కృషికి విఘాతం కలుగుతుందన్నారు.