చైనా తన తప్పు ఒప్పుకుందా..? ఆసక్తి రేపుతున్న చైనా ప్రభుత్వాధికారి వ్యాఖ్య

ABN , First Publish Date - 2020-05-09T23:55:17+05:30 IST

కరోనా సంక్షోభం తొలినాళ్లలో ఉండగానే దాన్ని కట్టడి చేయడంలో చైనా విఫలమైందంటూ వస్తున్న విమర్శలపై తొలిసారిగా ఆ దేశానికి చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చైనా తన తప్పు ఒప్పుకుందా..? ఆసక్తి రేపుతున్న చైనా ప్రభుత్వాధికారి వ్యాఖ్య

బీజింగ్: కరోనా సంక్షోభం తొలినాళ్లలో ఉండగానే దాన్ని కట్టడి చేయడంలో చైనా విఫలమైందంటూ వస్తున్న విమర్శలపై తొలిసారిగా ఆ దేశానికి చెందిన ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ దేశ ఆరోగ్య వ్యవస్థల్లోని లోపాలను కరోనా మహమ్మారి ఎత్తి చూపిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ లీ బిన్.. నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అంటువ్యాధుల నిర్వహణ, కట్టడి విధానంలో లోపాలను తొలగించే దిశగా సంస్కరణలు అమలు చేస్తున్నామని కూడా తెలిపారు.


లోపాలు బయటపడ్డాయ్...

‘కరోనా సంక్షోభం విసిరిన పెను సవాలు ద్వారా.. అంటువ్యాధుల నిర్వహణ కట్టడి, అత్యవసర పరిస్థితుల్లో అనుసరించాల్సి విధానాల్లోని లోపాలు బయటపడ్డాయి’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం చైనా.. అత్యంత అధునాతనమైన, కేంద్రీకృత ఆరోగ్య వ్యవస్థను త్వరలో అభివృద్ధి చేసేపనిలో ఉందని తెలిపారు. ఇందుకోసం అక్కడి అధికారులు బిగ్ డాటా, కృత్రిమ మేధస్సు, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతను వినియోగించబోతున్నట్టు చెప్పారు.


ఇక విధానపరమైన లోపాలు సరిదిద్దేందుకు కొత్త చట్టాలను రూపొందిస్తామన్నారు. అంతర్జాతీయంగా సమాచారం ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామన్నారు.  కరోనా సంక్షోభం తొలినాళ్లలో వైరస్‌కు పుట్టినిల్లైన వుహాన్‌లో ఏం జరిగిందనే విషయాన్ని బయటకుపొక్కకుండా చైనా కట్టడి చేసిందన్న ఆరోపణలు వినవస్తున్న నేపథ్యంలో ఓ ప్రభుత్వ అధికారి బహిరంగంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. 

Updated Date - 2020-05-09T23:55:17+05:30 IST