చైనాకు చుక్కలు చూపిస్తున్న నేపాల్!
ABN , First Publish Date - 2020-12-31T02:23:15+05:30 IST
నేపాల్ రాజకీయాలు చైనాకు చుక్కలు చూపిస్తున్నాయి. తాను ఎంతో కష్టపడి నేపాల్లో ఏర్పాటు రాజకీయ కూటమి తన ముందే కూలిపోయే స్థితికి చేరుకుంది.
న్యూఢిల్లీ: నేపాల్ రాజకీయాలు చైనాకు చుక్కలు చూపిస్తున్నాయి. తాను ఎంతో కష్టపడి నేపాల్లో ఏర్పాటు రాజకీయ కూటమి తన ముందే కూలిపోయే స్థితికి చేరుకుంది. నేపాల్ రాజకీయాల్లో కీలక నేతలైన ప్రచండ, కేపీ ఓలీ శర్మలను ఒక్కతాటిపైకి తెచ్చిన చైనా..2018లో నేపాల్ కమ్యునిస్టు పార్టీని ఉనికిలోకి తెచ్చింది. కలసి పాలన చేయండి అంటూ ఆ నేతలకు సూచించింది. గతంలో వారి మధ్య ఉన్నఅభిప్రాయబేధాలు క్రమంగా కనుమరుగువుతాయనుకుంది. కానీ..కేపీ ఓలీ శర్మ, ప్రచండ మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వారి మధ్య సయోధ్య కోసం చైనా పడుతున్న ప్రయాస అంతా వృథాయేనని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో నేపాల్ రాజకీయాలతో చైనా నెత్తికి బొప్పి కట్టినట్టైంది.
ప్రచండ, శర్మల మధ్య సయోధ్య కుదిర్చేందుకు చైనా ఇటీవల గువో యజావ్ అనే కీలక అధికారిని రంగంలోకి దిపింది. ఇటీవల నేపాల్లో దిగిన ఆయన... ప్రచండ, శర్మల మధ్య రాజీ కుదిర్చేందుకు విశ్వప్రయత్నమే చేశారు. కానీ..ఇరు నేతల మధ్య అభిప్రాయబేధాలు తారా స్థాయికి చేరుకోవడంతో చైనా ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. పార్లమెంటు రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేది లేదని కేపీ ఓలీ శర్మ చైనాకు తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం నేపాల్ సుప్రీం కోర్టు పరిథిలోకి వెళ్లింది. సుప్రీం తీర్పును బట్టి..కేపీ ఓలీ శర్మీను పక్కకు తప్పించి ప్రచండ, మాధవ్ కుమార్ నేపాల్తో కలసి మరో ప్రత్యాన్మాయ కూటమి ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా తెరపైకి వచ్చింది. అయితే..ఈ ప్లాన్ భవిష్యత్తు మొత్తం సుప్రీం తీర్పుపై ఆధారపడనుంది.
మరోవైపు..ప్రచండ, మాధవ్, ఇతర ప్రతిపక్ష పార్టీలతో కలిపి మరో కూటమి ఏర్పాటు చేయాలనే ప్లాన్ను కూడా చైనా ట్రైచేసింది. ఇది నేపాల్ ప్రతిపక్ష పార్టీల అభిమతానికి అనుగుణంగానే ఉన్నప్పటికీ ఈ దిశగా కూడా ఇప్పటివరకూ ఆశించిన పురోగతి చోటుచేసుకోలేదు. దీంతో చైనా ప్రయత్నాలన్నీ ప్రస్తుతానికి ఫెయిలైనట్టేనని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆశించిన ఫలితం సాధించలేక.. చైనా బృందం ఉత్త చేతులతోనే నేపాల్ నుంచి వెనుదిరగక తప్పదనే భావన ప్రస్తుతం బలపడింది.