12 మంది తబ్లీగీలపై చార్జిషీట్
ABN , First Publish Date - 2020-06-22T07:03:45+05:30 IST
నేపాల్ నుంచి వచ్చిన 12 మంది తబ్లీగీ జమాత్ సభ్యులపై ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వారంతా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి సమావేశమయ్యారని ఆదివారం పోలీసులు తెలిపారు...

ముజఫర్నగర్, జూన్ 21: నేపాల్ నుంచి వచ్చిన 12 మంది తబ్లీగీ జమాత్ సభ్యులపై ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ పోలీసులు కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. వారంతా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి సమావేశమయ్యారని ఆదివారం పోలీసులు తెలిపారు. వారిపై ఏప్రిల్లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు జరిపామని చెప్పారు. వారందరినీ బెయిల్పై విడుదల చేశామని తెలిపారు. కాగా, పోలీసులు ఇప్పటికే ఢిల్లీ, మణిపూర్, హరియాణా, ఉత్తరప్రదేశ్కి చెందిన మరో 22 మందిపై కూడా చార్జిషీట్లు దాఖలు చేశారు.
సుప్రీం కోర్టులో విదేశీ తబ్లీగీల పిటిషన్
తబ్లీగీ కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు 35 దేశాలకు చెందిన 3,500 మందిని బ్లాక్ లిస్ట్లో పెడుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. మొత్తం నాలుగు పిటిషన్లు వేయగా.. ఇందులో ఒకటి థాయ్లాండ్కు చెందిన ఏడు నెలల గర్భిణి దాఖలు చేశారు. మార్చిలో నిర్వహించిన తబ్లీగీ కార్యక్రమాల్లో పాల్గొన్న 960 మందిపై ఏప్రిల్ 2న, ఈ నెల 4న మరో 2,500 మందికిపైగా విదేశీయులను బ్లాక్ లిస్ట్లో చేర్చారు. అకస్మాత్తుగా తీసుకున్న ఈ చర్యతో పాటు తమపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారని.. ఇది వ్యక్తి హక్తుల ఉల్లంఘనేనని పిటిషన్లలో పేర్కొన్నారు.