పీకే బెంగాల్ ప్రయాణంపై కేంద్రం దర్యాప్తు!
ABN , First Publish Date - 2020-04-24T23:06:59+05:30 IST
పశ్చిమ బెంగాల్లో లాక్డౌన్ నిబంధనలు ఏవీ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై మమతను కేంద్రం అనేక సార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.
![పీకే బెంగాల్ ప్రయాణంపై కేంద్రం దర్యాప్తు!](https://media.andhrajyothy.com/appimg/galleries/2020042402282312/04242020173652n42.jpg)
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపుతో వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బెంగాల్ ప్రయాణంపై కేంద్రం దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. కోవిడ్ -19 ను ఎదుర్కోవడంలో బెంగాల్ విఫలమైందంటూ కేంద్రం పదే పదే మండిపడుతున్న సమయంలో ఏం చేస్తే బాగుంటుందో చెప్పాలంటూ మమత పీకేను ఆశ్రయించింది. దీంతో హుటాహుటిన ఆయన ఓ కార్గో విమానంలో బెంగాల్కు ప్రయాణమయ్యారు.
‘‘లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి మరీ... వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ విమాన ప్రయాణానికి మొగ్గు చూపారా? అన్నదానిపై ఇప్పటికే మేము దర్యాప్తు ప్రారంభించాం. దీనిపై విమానాశ్రయ అధికారులను కూడా వివరణ కోరాం. కోల్కతాకు కార్గో విమానాలను నడిపే వారిని కూడా సంప్రదించాం. అయితే తమకు ఈ వ్యవహారంతో సంబంధమే లేదని ఎయిర్ లైన్స్ అధికారులు తెలిపారు’’ అని కేంద్ర విమానయాన శాఖ అధికారి ఒకరు వెల్లడించారు.
అయితే బెంగాల్కు ప్రయాణమైనట్లు వస్తున్న వార్తలను ప్రశాంత్ కిశోర్ ఖండించారు. తాను బెంగాల్కు ప్రయాణమైనట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. మార్చి 19 తర్వాత నేను ఏ ఏయిర్పోర్టుకూ వెళ్లలేదు. ఒకవేళ వెళ్లానని ఎవరైనా నిరూపిస్తే ఆ వివరాలను పబ్లిక్ డొమైన్లో పెట్టాలి’’ అని పీకే స్పష్టం చేశారు.
పశ్చిమ బెంగాల్లో లాక్డౌన్ నిబంధనలు ఏవీ అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించడంపై మమతను కేంద్రం అనేక సార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ప్రతిపక్ష బీజేపీ నేతలు కూడా మమతను ఈ విషయంలో తీవ్రంగానే విమర్శించారు. దీంతో మమత ఆత్మరక్షణలో పడిపోయారు. ఈ నేపథ్యంలో తమను గట్టెక్కించాలంటూ వ్యూహకర్త పీకేను సంప్రదించినట్లు సమాచారం. వెంటనే కోల్కతాకు రావాలంటూ మమత సర్కార్ నుంచి పిలుపు రావడంతో ఆయన హుటాహుటిన ఓ కార్గో విమానంలో కోల్కతాకు చేరుకున్నారు.