ఆంక్షలు విధించాలంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖలు

ABN , First Publish Date - 2020-12-30T20:16:26+05:30 IST

కరోనా కాలంలో న్యూ ఇయర్ రావడంతో కేంద్రం అప్రమత్తమైంది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని

ఆంక్షలు విధించాలంటూ రాష్ట్రాలకు కేంద్రం లేఖలు

న్యూఢిల్లీ  : కరోనా కాలంలో న్యూ ఇయర్ రావడంతో కేంద్రం అప్రమత్తమైంది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్రాలకు లేఖలు రాశారు. తుది నిర్ణయం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే అని చెబుతూ.... డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు విధించాలని కఠినంగా సూచించారు. ‘‘కొన్ని రోజులుగా క్రియాశీల కోవిడ్ కేసులు దేశంలో తగ్గుతున్నాయి. అయితే తాజాగా యూరప్, అమెరికా ప్రాంతాల్లో పెరుగుతున్న న్యూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో దేశంలో కొన్ని అత్యవసరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అత్యావశ్యకం. దేశంలో కఠినమైన నిఘా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.’’ అని కేంద్రం ఆ లేఖలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఓ వైపు నూతన సంవత్సర వేడుకలు, మరో వైపు శీతాకాలం... ఈ నేపథ్యంలో ప్రజలు ఎక్కువగా గుమిగూడకుండా, ఒకేచోట చేరకుండా నిరోధించాల్సిన అవసరం ఉందని కేంద్రం పేర్కొంది. ఇలా గుమిగూడటం ద్వారా కరోనా మహమ్మారి మరింత పెరిగే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. అయితే అంతర్రాష్ట్ర రాకపోకల విషయంలో ఎలాంటి ఆంక్షలూ ఉండవని ఆ లేఖలో కేంద్రం స్పష్టం చేసింది. 

Updated Date - 2020-12-30T20:16:26+05:30 IST