హత్రాస్ కేసు.. మరింత గడువు కోరిన సీబీఐ..

ABN , First Publish Date - 2020-12-17T03:16:31+05:30 IST

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ అత్యాచారం కేసులో దర్యాప్తు పూర్తి చేసేందుకు సీబీఐ మరింత గడువు కోరింది.

హత్రాస్ కేసు.. మరింత గడువు కోరిన సీబీఐ..

లక్నో: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హత్రాస్ అత్యాచారం కేసులో దర్యాప్తు పూర్తి చేసేందుకు సీబీఐ మరింత గడువు కోరింది. దీంతో జనవరి 27 వరకు సమయమిస్తూ అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఇవాళ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను అదేరోజుకు వాయిదా వేస్తున్నట్టు జస్టిస్ పంకజ్ మిథాల్, జస్టిస్ రాజన్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఇంతకు ముందు నవంబర్ 25న హత్రాస్ కేసు విచారణకు సంబంధించిన స్టేటస్ రిపోర్టును ధర్మాసనం ముందుంచిన సీబీఐ... డిసెంబర్ 10 నాటికల్లా దర్యాప్తు పూర్తిచేస్తామని తెలిపింది. హత్రాస్‌కు చెందిన 19 ఏళ్ల దళిత యువతిపై నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి, తీవ్రంగా గాయపర్చడంపై తీవ్ర కలకలం రేగిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 14న ఆమె ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అయితే ఆమె మృత దేహానికి పోలీసులు రాత్రికి రాత్రే అంత్యక్రియలు నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తమ కుమార్తె మృతదేహాన్ని చివరిసారి ఇంటికి కూడా తీసుకురానీయకుండా, అర్థరాత్రి వేళ తమ అనుమతి లేకుండా దహనం చేశారని బాధిత కుటుంబం ఆరోపించింది. 

Updated Date - 2020-12-17T03:16:31+05:30 IST