అలీగఢ్ జైల్లో హత్రాస్ నిందితులను విచారించిన సీబీఐ
ABN , First Publish Date - 2020-10-20T04:56:52+05:30 IST
యూపీలోని హత్రాస్లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులను..

లక్నో: యూపీలోని హత్రాస్లో 19 ఏళ్ల దళిత యువతిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్న నలుగురు వ్యక్తులను ఇవాళ సీబీఐ అధికారులు విచారించారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా అలీగఢ్ జైల్లో ఉన్న నిందితులు సందీప్, లవ్కుశ్, రవి, రాములను ప్రశ్నించేందుకు సీబీఐ బృందం కోర్టు అనుమతి తీసుకుంది. గత నెల 14న సామూహిక అత్యాచారం అనంతరం బాధితురాలికి తొలుత చికిత్స అందించిన జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యులను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించారు. తీవ్ర గాయాలపాలైన బాధిత యువతి ఢిల్లీలోని సఫ్తర్ గంజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గతనెల 29న మృతిచెందిన విషయం తెలిసిందే. అదే రోజుల రాత్రి కనీసం కుటుంబ సభ్యులను కూడా అనుమతించకుండా బాధితురాలి మృత దేహానికి జిల్లా అధికారులు బలవంతంగా అంత్యక్రియలు నిర్వహించినట్టు ఆరోపణలు వచ్చాయి. అధికారుల తీరుపై అలహాబాద్ హైకోర్టు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఈ వ్యవహారం యూపీలోని బీజేపీ ప్రభుత్వానికి కూడా తలనొప్పి తెచ్చిపెట్టడంతో.. సీఎం యోగి ఆదిత్యనాథ్ దీనిపై సీబీఐ విచారణకు సిఫారసు చేశారు. సీబీఐ అధికారులు ఇప్పటికే హత్రాస్ బాధిత కుటుంబం నుంచి వాంగ్మూలం రికార్డు చేశారు.