7 గంటలుగా కొడుతూనే ఉన్నారు: తమిళనాడు లాకప్ డెత్పై సీబీఐ
ABN , First Publish Date - 2020-10-27T18:23:21+05:30 IST
సాక్ష్యాధారాల్ని మార్చేందుకు, ధ్వంసం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని సీబీఐ పేర్కొంది. పోలీస్ స్టేషన్లో అంటిన రక్తపు మరకల్ని బెన్నిక్ బట్టలతో శుభ్రం చేసిన విషయాన్ని ప్రస్తావించింది.

చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన తండ్రీకొడుకుల లాకప్ డెత్పై సీబీఐ చార్జ్షీటు విడుదల చేసింది. ఆ చార్జ్షీటులో పోలీసులపై వస్తున్న ఆరోపణలు వాస్తవమేనని సీబీఐ తేల్చి చెప్పింది. దీంతో అరెస్ట్ చేయడానికి ముందే తండ్రీ కొడుకులు రోడ్డుపై పడిపోయారని, దీంతో వారికి తీవ్రగాయాలైనట్టు పోలీసులు అల్లింది కట్టుకథేనని తేలిపోయింది. పోలీసులు కస్టడీలోకి తీసుకోకముందు వారికి ఎలాంటి గాయాలులేవని అక్కడ సీసీటీవీ ఫుటేజ్ గతంలోనే బయటపెట్టింది. తాజాగా సీబీఐ వెల్లడించిన చార్జ్షీట్ పోలీసుల్ని మరింత ఇరకాటంలో నెట్టేసింది.
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంగించారనే కారణంతో తండ్రీ కొడుకుల్ని అరెస్ట్ చేసిన అనంతరం.. రాత్రి 7:30 నుంచి ఉదయం 3:00 వరకు కొడుతూనే ఉన్నట్లు సీబీఐ పేర్కొంది. అంతే కాకుండా గాయాల కారణంగానే వారు మరణించారని పోస్ట్మార్ట్ నివేదిక గతంలోనే పేర్కొంది. బాధితులపై తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని సీబీఐ పేర్కొంది. అంతే కాకుండా వారిద్దరూ లాక్డౌన్ నిబంధనల్ని ఉల్లంగించలేదని తెలిపింది. సాక్ష్యాధారాల్ని మార్చేందుకు, ధ్వంసం చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని సీబీఐ పేర్కొంది. పోలీస్ స్టేషన్లో అంటిన రక్తపు మరకల్ని బెన్నిక్ బట్టలతో శుభ్రం చేసిన విషయాన్ని ప్రస్తావించింది.