తెరపైకొచ్చిన వందేళ్లనాటి చికిత్స, కరోనా నుంచి కోలుకున్న వారి రక్తంతో...
ABN , First Publish Date - 2020-03-26T02:56:52+05:30 IST
కరోనా కట్టడికి మరోసారి తెరపైకి వచ్చిన వందేళ్ల నాటి చికిత్స

వాషింగ్టన్: అది వందేళ్ల నాటి చికిత్స. వ్యాక్సీన్లు గట్రా అందుబాటులో లేని సమయంలో అంటువ్యాధుల అరికట్టేందుకు ఈ చికిత్సను వాడేవారు. కోలుకున్న వారి రక్తం నుంచి సేకరించిన ప్లాస్మాను బాధితులకు ఎక్కించడం ద్వారా వ్యాధిని నయం చేసేవారు. అప్పట్లో ఇలా సేకరించిన ప్లాస్మాను కొవెలెసెంట్ సీరం అని పిలిచేవారు. ప్రస్తుతం డొనేటెడ్ ప్లాస్మా అని పిలుస్తున్నారు. సార్స్, ఇబోలా ప్రబలినప్పుడు కూడా ఈ చిక్సతను అందించడం ద్వారా కొంత మంచి ఫలితాలను రాబట్టారు. కరోనా బీభత్సం నేపథ్యంలో ఈ వైద్యం మరోసారి తెరపైకి వచ్చింది.
కరోనా పనిపట్టేందుకు ఈ చికిత్స ఉపకరిస్తుందో లేదో తెలుసుకునేందుకు అమెరికా ఆసుపత్రులు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నాయి. ఎఫ్డీఏ అనుమతికి ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. అనుమతి లభించగానే పరీక్షలు ప్రారంభమవుతాయి. ఈ చికిత్సతో రెండు లాభాలున్నాయని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం రోగంతో బాధపడుతున్న వారిని కోలుకునేలా చేయడంతో పాటూ కొత్త వారికి కరోనా సోకకుండా ఉండేందుకు ఈ చికిత్స ఓ తాత్కాలిక వ్యాక్సిన్లా ఉపయోగపడే అవకాశం ఉందని చెబుతున్నాయి. అయితే ఈ చికిత్స ఆశించిన ఫలితాన్ని ఇస్తుందన్న గ్యారెంటీ మాత్రం ప్రస్తుతానికి ఇవ్వలేమని అంటున్నాయి. ‘ఒక సారి ఈ విధానాన్ని పరీక్షించే వరకూ ఏమవుతుందో చెప్పలేము. అయితే చారిత్రక ఆధారాలను చూస్తే మాత్రం దీనితో కరోనా కట్టడి సాధ్యమయ్యే అవకాశం ఉంది’ అని ఓ డాక్టర్ వ్యాఖ్యానించారు.