యోగి మోకాలడ్డు...వెనుదిరిగిన కాంగ్రెస్ బస్సులు

ABN , First Publish Date - 2020-05-18T21:16:27+05:30 IST

వలస కార్మికుల కోసం రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన 980 బస్సులు ఉత్తరప్రదేశ్‌లో అడుగుపెట్టకుండానే ..

యోగి మోకాలడ్డు...వెనుదిరిగిన కాంగ్రెస్ బస్సులు

న్యూఢిల్లీ: యూపీ వలస కార్మికుల కోసం రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన 980 బస్సులు ఉత్తరప్రదేశ్‌లో అడుగుపెట్టకుండానే వెనుదిరిగాయి. రాజస్థాన్‌లోని భరత్‌బపూర్, ఆల్వార్, తదితర ప్రాంతాలకు తిరిగి చేరుకున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ బస్సులను యూపీలోకి అడుగుపెట్టేందుకు అనుమతి నిరాకరించడంతో కాంగ్రెస్ చేసిన ప్రయత్నం విఫలమైంది. దీంతో యోగి ఆదిత్యనాథ్‌ను నేరుగా తమ పార్టీ నేతలు కలుసుకుని, విజ్ఞాపనులు అందించేందుకు కాంగ్రెస్ తాజా ప్రయత్నాలు మొదలుపెట్టింది.


కాంగ్రెస్ పార్టీ నుంచి తమకు ఎలాంటి బస్సుల జాబితా అందలేదని ఉత్తరప్రదేశ్ ప్రబుత్వం చెబుతుండగా, పీఎంఓ కార్యాలయానికి ఇవాళే జాబితా అందిస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. యూపీ వలస కార్మికులతో వస్తున్న బస్సులను రాష్ట్రంలోకి అనుమతించాలని ప్రియాంక గాంధీ గత మూడు రోజులుగా యోగి ఆదిత్యనాథ్‌కు లేఖలు రాస్తూనే ఉన్నారని, వాటికి ఎలాంటి అనుమతి ఇవ్వకపోవడంతో 12 గంటల పాటు వేచిచూసి బస్సులు వెనుదిరిగాయని కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద తెలిపారు.


యూపీ సరిహద్దులకు చేరుకున్న బస్సులను అనుమతించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఆదివారంనాడు యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు. ముఖ్యమంత్రికి తాను చేసిన విజ్ఞప్తికి సంబంధించిన వీడియోను కూడా ఆమె విడుదల చేశారు. 1000 చార్టెట్ బస్సులకు అయ్యే చార్జీలను తామే భరిస్తామని కూడా యోగికి రాసిని ఒక లేఖలో ఆమె పేర్కొన్నారు.

Updated Date - 2020-05-18T21:16:27+05:30 IST