జిన్పింగ్ అనుకుని.. కిమ్ దిష్టిబొమ్మలు దగ్ధం
ABN , First Publish Date - 2020-06-19T21:18:13+05:30 IST
గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక..
![జిన్పింగ్ అనుకుని.. కిమ్ దిష్టిబొమ్మలు దగ్ధం](https://media.andhrajyothy.com/appimg/galleries/2020061903462519/06192020154807n34.jpg)
అసాంసోల్: గాల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా చైనా వ్యతిరేక సెంటిమెంట్ ఊపందుకుంటోంది. పలు ప్రాంతాల్లో జనం రోడ్లపైకి వచ్చి చైనాకు వ్యతిరేకంగా జెండాలు, దిష్టిబొమ్మలు తగులబెడుతున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్లోని అసాంసోల్లో ఓ ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.
భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు కార్యకర్తలు చైనా వ్యతిరేక నిరసనలు అసాంసోల్లో చేపట్టారు. అయితే చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దిష్టిబొమ్మకు బదులుగా పొరపాటున ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ దిష్టిబొమ్మను వారు తగులబెట్టారు. చైనా ప్రధాని కిమ్ జోంగ్ అంటూ నిరసనకారులు సంబోధించడం కూడా కనిపించింది. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా జరిగిన పొరపాటుకు సంబంధించిన ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిరసనకారుల ఆగ్రహం గురితప్పిందని కొందరు నెటిజన్లు స్పందిస్తే, లైట్గా తీసుకోండంటూ మరికొందరు స్పందించారు. అయితే, 'కరోనా వైరస్ గో' అంటూ నిరసనల్లో పాల్గొన్న మహిళ ఒకరు కుండపై దరువు వేస్తూ నినాదాలు చేయడం అసలు ఘటన కంటే 100 శాతం నవ్వు పుట్టిస్తోందంటూ మరో నెటిజన్ వ్యాఖ్యానించారు.