రజనీతో పొత్తుపై బీజేపీ కీలకనేత ఏమన్నారంటే..
ABN , First Publish Date - 2020-03-02T14:21:43+05:30 IST
తమిళ సూపర్స్టార్ రజనీకాంత్తో పొత్తుపెట్టుకునే విషయంపై

చెన్నై : తమిళ సూపర్స్టార్ రజనీకాంత్తో పొత్తుపెట్టుకునే విషయంపై పార్టీ అధిష్టానవర్గం పరిశీలిస్తుందని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ తెలిపారు. చెన్నై విమానాశ్రయం వద్ద ఆదివారం మధ్యాహ్నం మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరికీ నష్టం కలుగదని అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు. నటుడు రజనీకాంత్ సీఏఏకు మద్దతు ప్రకటించారని, ప్రస్తుతం ఢిల్లీలో జరిగిన అల్లర్ల నేపథ్యంలో ముస్లింలకు మద్దతుగా ప్రకటన చేయడాన్ని తప్పుబట్టలేమని చెప్పారు. రజనీతో బీజేపీ పొత్తుకుదుర్చుకుంటుందా అని ప్రతిచోటా పాత్రికేయులు ప్రశ్నిస్తున్నారని, ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది అధిష్టానవర్గమేనని చెప్పారు.
తొలుత రజనీ రాజకీయ పార్టీని ప్రారంభించాల్సి వుందని, ఆ తర్వాత ఆ పార్టీ సిద్ధాంతాలను క్షుణంగా పరిశీలించినమీదట ఆయనతో పొత్తుపెట్టుకోవాలా వద్దా అనే విషయంపై తాము అధిష్టాన వర్గానికి ప్రతిపాదనలు పంపుతామని పొన్ రాధాకృష్ణన్ అన్నారు. ఇక రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అధికార అన్నా డీఎంకేతో ఎలాంటి చర్చలు జరుపలేదని తమ పార్టీకి ఓ సీటు కేటాయించాలని కూడా అడగలేదని ఆయన స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ వచ్చే యేడాది జరుగనున్న శాసనసభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు.