దుర్గమ్మ నన్ను కాపాడింది : జేపీ నడ్డా
ABN , First Publish Date - 2020-12-10T20:18:15+05:30 IST
పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా

కోల్కతా : పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై రాళ్ళ దాడి జరిగింది. ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనంలో ఉండటంతో క్షేమంగా బయటపడ్డారు. బీజేపీ నేతలు ముకుల్ రాయ్, కైలాశ్ విజయవర్గీయ గాయపడ్డారు. వీరంతా కోల్కతాకు సమీపంలోని సౌత్ 24 పరగణాస్కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. ఈ సంఘటనపై నివేదిక సమర్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కోరారు.
ఆన్లైన్లో పోస్ట్ చేసిన ఓ వీడియోనుబట్టి బీజేపీ నేతలు ప్రయాణిస్తున్న కార్లపై ఇటుకలు, రాళ్ళతో దాడి జరిగినట్లు కనిపించింది. కార్ల అద్దాలు పగిలిపోవడం కనిపించింది. ఈ దాడిలో బీజేపీ నేతలు ముకుల్ రాయ్, కైలాశ్ విజయవర్గీయ గాయపడినట్లు జేపీ నడ్డా విలేకర్లకు చెప్పారు. ఇది ప్రజాస్వామ్యానికి సిగ్గు చేటు అని ఆరోపించారు. తమ కాన్వాయ్లోని అన్ని కార్లపైనా దాడి జరిగిందన్నారు. తాను బుల్లెట్ ప్రూఫ్ కారులో ప్రయాణించడం వల్ల సురక్షితంగా బయటపడినట్లు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో అరాచక, అసహన పరిస్థితులకు తెరపడాలన్నారు. ‘‘నేను సమావేశానికి రాగలిగానంటే, అది కేవలం దుర్గా మాత దయ వల్లనే’’ అని జేపీ నడ్డా తెలిపారు.
కైలాశ్ విజయవర్గీయ మాట్లాడుతూ, ఈ దాడిలో తాను గాయపడ్డానన్నారు. జేపీ నడ్డా ప్రయాణిస్తున్న కారుపై కూడా దాడి జరిగిందన్నారు. తాము ఈ సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పోలీసుల సమక్షంలోనే గూండాలు తమపై దాడి చేశారన్నారు. మేము మన దేశంలోనే ఉన్నామా? అనే భావన తమకు కలిగిందని చెప్పారు.
బీజేపీ పశ్చిమ బెంగాల్ శాఖ చీఫ్ దిలీప్ ఘోష్ మాట్లాడుతూ, కొందరు వ్యక్తులు కర్రలు, రాళ్ళతో నడ్డా కాన్వాయ్పై దాడి చేశారన్నారు. నడ్డాకు జెడ్-కేటగిరీ సెక్యూరిటీ ఉన్నప్పటికీ, దాడి జరుగుతున్నపుడు పోలీసులు ప్రేక్షకుల్లా చూశారని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ శాసన సభ ఎన్నికలు సుమారు 6 నెలల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ దూకుడుగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. జేపీ నడ్డా రెండు రోజులపాటు పర్యటించేందుకు రాష్ట్రానికి వచ్చారు.