ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంటిపై బీజేపీ గూండాల దాడి: ఆప్ ఆరోపణ
ABN , First Publish Date - 2020-12-11T08:14:47+05:30 IST
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటిపై బీజేపీ గూండాలు దాడి చేశారని ఆప్ గురువారం ఆరోపించింది.
న్యూఢిల్లీ, డిసెంబరు 10: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇంటిపై బీజేపీ గూండాలు దాడి చేశారని ఆప్ గురువారం ఆరోపించింది. బీజేపీ ఢిల్లీ శాఖ ఆ ఆరోపణలను ఖండించింది. శాంతియుతంగా నిరసన తెలిపినట్లు పేర్కొంది. దీనికి సంబంధించి కేసు నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఢిలీ మహిళా పోలీస్ కమిషనర్ చెప్పారు. ఢిల్లీ పోలీసుల స్పందన కూడా కోరినట్లు పేర్కొన్నారు.
తమ పార్టీ అధికారంలో ఉన్న మునిసిపల్ కార్పొరేషన్ల మేయర్లను, నాయకులను హత్య చేయడానికి కుట్ర పన్నినట్లు బీజేపీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత ఒక రోజు సిసోడియా ఇంటి ముందు నిరసన తెలిపారు. సిసోడియా ఇంటిపై దాడిని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఖండించారు. తాను ఇంట్లోలేని సమయంలో బీజేపీ గూండాలు తన ఇంటి తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించి తన భార్య, పిల్లలపై దాడి చేయడానికి ప్రయత్నించినట్లు సిసోడియా ట్విటర్లో పేర్కొన్నారు.