బీహార్లో ప్రారంభమైన పోలింగ్
ABN , First Publish Date - 2020-11-07T12:51:01+05:30 IST
బీహార్ అసెంబ్లీ ఎన్నికల మూడవ దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమయ్యింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు...
![బీహార్లో ప్రారంభమైన పోలింగ్](https://media.andhrajyothy.com/appimg/galleries/2020110706034900/11072020072051n59.jpg)
పట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల మూడవ దశ పోలింగ్ ఈరోజు ప్రారంభమయ్యింది. ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ బూత్ల ముందు బారులు తీరారు. బీహార్ మూడవ దశ ఎన్నికల్లో మొత్తం 78 అసెంబ్లీ సీట్లుకు పోలింగ్ జరుగుతోంది. అలాగే వాల్మీకినగర్ ఎంపీ సీటుకు కూడా పోలింగ్ జరుగుతోంది.
ఈ రోజు జరుగుతున్న ఎన్నికల్లో మొత్తం 2 కోట్ల 35 లక్షల 54 వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ రోజు జరిగే ఎన్నికల్లో బీహార్ సర్కార్లోని 11 మంది మంత్రులు తమ అదృష్టాన్నిపరీక్షించుకోనున్నారు. మొత్తం 1204 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఇదిలావుండగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒక ట్వీట్లో... బీహార్ మూడవ దశ ఎన్నికల్లో ఓటర్లంతా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు. బీహార్ యువత తాము ఓటు వేయడమే కాకుండా, ఓటు అర్హత కలిగిన ఇతరులు కూడా ఓటు వేసే విధంగా ప్రోత్సహించాలని కోరారు.