హర్యానాలో ఉద్రిక్తత... పోలీసులు వర్సెస్ రైతులు
ABN , First Publish Date - 2020-11-26T17:08:54+05:30 IST
అంబాలా- పాటియాలా ప్రాంతం రైతులు వర్సెస్ పోలీసులుగా మారిపోయింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ

హర్యానా : అంబాలా- పాటియాలా ప్రాంతం రైతులు వర్సెస్ పోలీసులుగా మారిపోయింది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేస్తోన్న ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. యూపీ, హర్యానా, ఉత్తరాఖండ్, రాజస్థాన్, కేరళ, పంజాబ్ రైతులు కాలి నడకన ఢిల్లీకి బయల్దేరారు. అయితే హర్యానా పోలీసులు అంబాలా- పాటియాలా ప్రాంతంలో రైతులను అడ్డుకున్నారు. వందల కొద్ది వస్తున్న రైతులను అడ్డుకోడానికి హర్యానా పోలీసులు బారికేడ్లతో రోడ్లను మూసేశారు. రైతులు వెనక్కి వెళ్లిపోవాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. అయినా సరే రైతులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. బారికేడ్లను దగ్గర్లో ఉన్న శంభూ నదిలోకి విసిరి పారేశారు. వందలాది మంది రైతులు తమ చేతిలో ఉన్న రాళ్లను పోలీసులపైకి విసిరారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా రణరంగంలా మారిపోయింది.
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు రైతులపై టియర్ గ్యాస్, షెల్స్, వాటర్ కెనన్లను ప్రయోగించారు. మరోవైపు రైతులు ‘‘చలో ఢిల్లీ’’ ప్రకటించిన నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు రోజులుగా తమ సరిహద్దుల్లో పోలీసులను మోహరించింది. బారికేడ్లను సిద్ధం చేసింది. వచ్చిన రైతులను వెనక్కి పంపించడానికి పోలీసులు తగిన ఏర్పాట్లు కూడా చేశారు. వీటితో పాటు హర్యానా నుంచి పంజాబ్ కు వెళ్లే బస్సు సర్వీసులను కూడా ఖట్టర్ ప్రభుత్వం రద్దు చేసింది,.