నిషేధిత యాప్స్తో దేశ భద్రతకు ముప్పు : కేంద్రం
ABN , First Publish Date - 2020-09-04T01:28:53+05:30 IST
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)లకు భారత దేశం అనుకూలమే అయినప్పటికీ, అన్ని కంపెనీలు తప్పనిసరిగా

న్యూఢిల్లీ : విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ)లకు భారత దేశం అనుకూలమే అయినప్పటికీ, అన్ని కంపెనీలు తప్పనిసరిగా భారత దేశంలోని చట్టాలకు అనుగుణంగా నడచుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటి వరకు 224 చైనీస్ మొబైల్ యాప్లను నిషేధించిన నేపథ్యంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ గురువారం మాట్లాడుతూ ఈ కంపెనీలకు కచ్చితంగా బాధ్యత ఉందన్నారు.
ప్రపంచంలో ఎఫ్డీఐలకు అనుకూలమైన దేశాల్లో భారత దేశం ఒకటి అని అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ఇంటర్నెట్ కంపెనీలు, డిజిటల్ టెక్నాలజీ కంపెనీలను సైతం స్వాగతిస్తున్నట్లు చెప్పారు.
ఈ నెల 2న మరొక 118 చైనీస్ మొబైల్ యాప్లను నిషేధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఈ కంపెనీలకు కూడా బాధ్యత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియమ, నిబంధనలను ఈ కంపెనీలు పాటించాలన్నారు. ఈ యాప్ల కార్యకలాపాలు భారత దేశ భద్రతకు హానికరమని చెప్పారు.
భారత దేశం ఇప్పటికీ అన్ని కంపెనీలను స్వాగతిస్తోందని, అయితే అవి తప్పనిసరిగా భారత దేశ నియమ, నిబంధనలకు లోబడి పని చేయాలని చెప్పారు.
ఈ నెల 2న ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఈ మొబైల్ యాప్లు భారత దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, రక్షణ, రాజ్య భద్రత, ప్రజాశాంతిలకు హానికరమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు పేర్కొంది. వీటిని నిషేధించడం వల్ల కోట్లాదిమంది భారతీయుల ప్రయోజనాలకు రక్షణ లభిస్తుందని తెలిపింది. భారత దేశ సైబర్స్పేస్ భద్రత, రక్షణ, సార్వభౌమాధికారాల కోసమే వీటిని నిషేధించినట్లు తెలిపింది.