ఇంటర్నెట్ ఆంక్షలతో స్థానిక పరిశ్రమలు నష్టపోతున్నాయి: ఒమర్ అబ్దుల్లా
ABN , First Publish Date - 2020-06-25T21:41:11+05:30 IST
ఇంటర్నెట్ వేగానికి, వినియోగానికి సంబంధించి కాశ్మీర్లో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్న...

శ్రీనగర్: ఇంటర్నెట్ వేగానికి, వినియోగానికి సంబంధించి కాశ్మీర్లో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఆంక్షల కారణంగా స్థానిక ప్రరిశ్రమలు దెబ్బతింటున్నాయని, వ్యాపారులు నష్టపోతున్నారని స్థానిక నేత ఒమర్ అబ్దుల్లా మండిపడ్డారు. కాశ్మీర్లోని నదుల నుంచి మినరల్స్ను వెలికితీసేందుకుగానూ ఇటీవల ప్రభుత్వం టెండర్లు పిలిచింది. దీనికి ఊహించిన దానికంటే భారీ స్పందన లభించింది. కాంట్రాక్ట్ కోసం దేశంలోని అనేక రాష్ట్రాలకు చెందిన కంపెనీలు పోటీపడ్డాయి. అంతేకాకుండా ఇతర రాష్ట్రాల కంపెనీలే అత్యధిక కాంట్రాక్టులను చేజిక్కించుకున్నాయి. దీనిని ప్రశంసిస్తూ ఓ జాతీయ వార్తా సంస్థ తన ట్విటర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది.
‘ఇన్నేళ్లలో మొదటిసారి కాశ్మీర్ వెలుపలి కంపెనీలు ఇక్కడ కాంట్రాక్టులను దక్కించుకున్నాయని’ ఆ పోస్ట్లో పేర్కొంది. దీనిపై ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘కాశ్మీర్లో హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో లేవు. దీంతో స్థానిక కంపెనీలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. అందుకే కనీసం టెండర్లు కూడా వేయలేకపోయాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.