బాబ్రీ కేసులో తీర్పునకు మరింత గడువు

ABN , First Publish Date - 2020-05-09T09:18:25+05:30 IST

బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ఆగస్టు 31లోగా తీర్పును వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

బాబ్రీ కేసులో తీర్పునకు మరింత గడువు

న్యూఢిల్లీ, మే 8: బాబ్రీమసీదు కూల్చివేత కేసులో ఆగస్టు 31లోగా తీర్పును వెలువరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆలోగా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సాక్షుల వాంగ్మూలాలను సేకరించడం, ట్రయల్స్‌ సమయంలో దాఖలైన వ్యాజ్యాలను పరిశీలించడం పూర్తిచేయాలని యూపీ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.కె.యాదవ్‌కు సూచించింది. గత ఏడాది జూలై 19న ఈ కేసులో తీర్పు వెలువరించేందుకు రెండేళ్ల సమయం కావాలని జస్టిస్‌ యాదవ్‌ సుప్రీంకోర్టును కోరగా.. తొమ్మిది నెలల గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసు తేలేదాకా జస్టిస్‌ యాదవ్‌కు పదవీ విరమణ ఉండదని అప్పట్లో స్పష్టం చేసింది. సాక్షుల వాంగ్మూలాల సేకరణకు గడువు ఇవ్వాలంటూ జస్టిస్‌ యాదవ్‌ తాజాగా ఈ నెల 6న మరోమారు సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. దీనిపై జస్టిస్‌ ఆర్‌.ఎ్‌ఫ.నారిమన్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం మరో మూడు నెలల గడువు (ఆగస్టు 31లోగా) ఇచ్చింది. 

Updated Date - 2020-05-09T09:18:25+05:30 IST