ప్రపంచమంతా వీక్షించేలా లైవ్లో రామమందిర భూమి పూజ!
ABN , First Publish Date - 2020-07-27T11:59:35+05:30 IST
రామజన్మభూమిలో నిర్మించబోయే రామాలయానికి సంబంధించిన భూమిపూజా కార్యక్రమాలను దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆగస్టు 5న జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ...

అయోధ్య: రామజన్మభూమిలో నిర్మించబోయే రామాలయానికి సంబంధించిన భూమిపూజా కార్యక్రమాలను దూరదర్శన్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఆగస్టు 5న జరిగే ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపిన వివరాల ప్రకారం రామాలయ భూమి పూజా కార్యక్రమాలన్నింటినీ దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారాన్ని ప్రసారం చేయనుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా చూపించేందుకు ఇతర ఛానళ్లు కూడా సన్నాహాలు చేస్తున్నాయన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా అయోధ్యకు ప్రజలు తరలిరావద్దని రాయ్ విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉండి, రామాలయ భూమి పూజను చూడాలని, పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. ఆగస్టు 5న భారతదేశంలోని రామభక్తులు, సాధువులు తాము ఉంటున్న ప్రదేశంలోనే పూజలు చేస్తారని రాయ్ చెప్పారు.