అసోం రాజ్భవన్లో కరోనా కేసు..కంటైన్మెంట్ జోన్గా ప్రకటన
ABN , First Publish Date - 2020-07-05T13:04:43+05:30 IST
అసోం రాష్ట్ర రాజ్ భవన్ ఆవరణలో ఒకరికి కరోనా వైరస్ సోకడంతో ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.....
గువాహటి (అసోం): అసోం రాష్ట్ర రాజ్ భవన్ ఆవరణలో ఒకరికి కరోనా వైరస్ సోకడంతో ఆ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. అసోం రాజధాని నగరమైన గువాహటిలోని రాజ్ భవన్ లో ఒకరికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమై తాము రాజ్ భవన్ క్యాంపస్ ను కంటైన్మెంటు జోన్ గా ప్రకటించామని కాంరూప్ మెట్రోపాలిటన్ జిల్లా డిప్యూటీ కమిషనర్ బిశ్వజిత్ పేగు జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రకటించారు. హోటల్ బెల్లీ నుంచి బాంకోవర్ నగర్ , బోర్తాకూర్ క్లినిక్ , ఎంజీరోడ్డు సరిహద్దులుగా అసోం రాజ్ భవన్ క్యాంపస్ ను కంటైన్మెంటు జోన్ గా ప్రకటించినందున వెంటనే ఈ ప్రాంతానికి సీలు వేయాలని గువాహటి రెవెన్యూ సర్కిల్ అధికారులను బిశ్వజిత్ పేగు ఆదేశించారు. ఇప్పటికే వరదలతో విలవిల్లాడుతున్న అసోం రాష్ట్రంలో 9,873 కరోనా కేసులు నమోదైనాయి. 14 మంది మరణించారు. దీంతో అసోం అధికారులు కరోనా కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నారు.