అసోంలో వరద బీభత్సం...71మంది మృతి
ABN , First Publish Date - 2020-07-18T14:19:13+05:30 IST
అసోంలో వరద బీభత్సం...71మంది మృతి

అసోం: రాష్ట్రంలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఇక బ్రహ్మపుత్రా నది ప్రమాదకరస్థాయి దాటి ప్రవహిస్తోంది. ఫలితంగా ఊళ్లకు ఊళ్లు నీట మునిగాయి. వరదల కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 71మంది మృతి చెందారు. వీరిలో 26 మంది కొండచరియలు విరిగి పడటంతో ప్రాణాలు కోల్పోయారు. మొత్తం 27 జిల్లాలపై వరదలు తీవ్ర ప్రభావం చూపాయాని అసోం స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ తెలిపింది. అసోంలోని 122 రెవెన్యూ సర్కిళ్లు వరద ప్రభావానికి లోనయ్యాయి. 4766 గ్రామాలు నీటమునిగాయి. 40 లక్షల మంది నిర్వాసితులు అయ్యారు. ముంపు ప్రాంతాల్లో బాధితుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బలగాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ఆవాసాలు కోల్పోయిన వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద బాధితుల కోసం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా 445 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు.