దేశంలో ఉపాధి కోల్పోయిన 70 శాతం కూలీలు
ABN , First Publish Date - 2020-05-13T14:56:51+05:30 IST
కరోనా సంక్షోభం నేపధ్యంలో అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం, సివిల్ సొసైటీ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో దేశంలో ఉపాధి రంగానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి.

న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం నేపధ్యంలో అజీమ్ ప్రేమ్జీ విశ్వవిద్యాలయం, సివిల్ సొసైటీ సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఒక సర్వేలో దేశంలో ఉపాధి రంగానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. లాక్డౌన్ పరిస్థితుల్లో మూడింట రెండు వంతుల మంది జనం తమ జీవనోపాధిని కోల్పోయారని వెల్లడయ్యింది. అలాగే ఉపాధి ఉన్న వారి సంపాదనలో భారీ తగ్గుదల కనిపించింది. దేశంలోని సగం కంటే ఎక్కువ గృహాలలో ఒక వారానికి సరిపడా నిత్యావసరాలు కొనుగోలు చేయడం కష్టంగా మారింది. లాక్డౌన్లో పెద్ద కంపెనీలలో పని నిలిచిపోగా, సదరు కంపెనీల ఆధారంగా నడుస్తున్న వ్యాపారాలు కూడా మూతబడటం ఆందోళనకరంగా మారింది. ఈ సర్వేను ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్లలో నిర్వహించారు. పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. ప్రతి పది మందిలో ఎనిమిది మంది ఉపాధి కోల్పోయారు. అంటే 80 శాతం మంది నిరుద్యోగులుగా మారారు. దేశం మొత్తం మీద చూసుకుంటే 70 శాతం కూలీలు ఉపాధి కోల్పోయారని ఈ సర్వేలో వెల్లడయ్యింది.