మిలట్రీ ఆసుపత్రిలో సైనికులను కలిసిన నరవనే
ABN , First Publish Date - 2020-06-23T22:21:09+05:30 IST
తూర్పు లడక్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే భారత సైనికుల్లో మరింత ఆత్మస్థైర్యం..

లెహ్: తూర్పు లడక్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవనే భారత సైనికుల్లో మరింత ఆత్మస్థైర్యం నింపారు. లెహ్ మిలటరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాహస సైనికులను మంగళవారంనాడు కలిసి వారిని అభినందించారు. వారితో నేరుగా మాట్లాడి వారిని మరింత ఉత్తేజితులను చేశారు. ఇండియన్ ఆర్మీ ఓ ట్వీట్లో ఈ విషయాన్ని తెలియజేసింది.
నరవనే తన పర్యటనలో భాగంగా లడక్లో వాస్తవ పరిస్థితిని, చైనా మిలటరీతో చర్యల ప్రగతిని అధికారులతో కలిసి సమీక్షించనున్నారు. ఆర్మీ అధికారుల సమాచారం ప్రకారం, ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న రెండ్రోజుల కమాండర్స్ కాన్ఫరెన్స్ సదస్సులో పాల్గొనేందుకు కమాండర్లు అంతా దేశ రాజధానిలోనే ఉన్నారు.
గల్వాన్ లోయలో చైనాతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు వీరమరణం పొందిన నేపథ్యంలో ఉద్రిక్తతలను సడలించేందుకు ఇండియా, చైనా మధ్య మిలటరీ స్తాయి చర్చలు జరుగుతున్నతరుణంలోనే కమాండర్ల సదస్సు ఢిల్లీలో జరుగుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.