గాలివాన మధ్య ఫైర్ సర్వీస్ వ్యానులో గర్భిణీ ప్రసవం
ABN , First Publish Date - 2020-05-20T18:05:48+05:30 IST
ఆంఫన్ తుపాన్ ప్రభావంతో హోరు గాలివాన కురుస్తుండగా పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీని అగ్నిమాపకశాఖ వ్యానులో బుధవారం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన
భువనేశ్వర్ (ఒడిశా): ఆంఫన్ తుపాన్ ప్రభావంతో హోరు గాలివానలో ఓ మహిళ వ్యానులోనే ప్రసవించిన ఘటన ఒడిశా రాష్ట్రంలో బుధవారం జరిగింది. జోరున వర్షం కురుస్తుండగా పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణీని అగ్నిమాపకశాఖ వ్యానులో బుధవారం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఒడిశా రాష్ట్రంలోని కేంద్రపర జిల్లాలో వెలుగుచూసింది. తుపాన్ ప్రభావంతో వీస్తున్న గాలికి చెట్లు రోడ్డుపై పడి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. హోరు గాలితో పాటు జడివాన కురుస్తుండగా కేంద్రపారా పట్టణానికి చెందిన జానకీ సేథి అనే 20 ఏళ్ల గర్భిణీ పురిటినొప్పులతో బాధపడుతుందని, రోడ్డుపై చెట్లు పడిపోయినందున అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి ఉందని మహాకాలపద అగ్నిమాపకశాఖ కార్యాలయానికి బుధవారం ఉదయం 9 గంటలకు ఆమె కుటుంబసభ్యుల నుంచి ఫోన్ వచ్చింది. దీంతో అగ్నిమాపకశాఖ అధికారులు రెండు అగ్నిమాపక శాఖ వ్యాన్లు తీసుకొని మహిళ ఇంటికి వచ్చారు. పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణీని వ్యానులో ఎక్కించుకున్నారు. దారిలో రోడ్డుపై అడ్డంగా పడిన 22 చెట్లను అగ్నిమాపక శాఖ ఉద్యోగులు పవర్ సా సాయంతో తొలగించి గర్భిణీని ఆసుపత్రికి తరలిస్తున్నారు. మహాకాలపద ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే గర్భిణి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ప్రసవం అనంతరం వీరిద్దరినీ అగ్నిమాపకశాఖ అధికారులు వ్యానులో ఆసుపత్రికి తరలించారు. తుపాన్ సమయంలో స్పందించిన అగ్నిమాపకశాఖ అధికారులు, సిబ్బందిని మహిళ కుటుంబసభ్యులు ప్రశంసించారు.