బీజేపీ బర్తరఫ్ అయితేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది: అఖిలేష్
ABN , First Publish Date - 2020-12-30T00:35:44+05:30 IST
వచ్చే ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజలకు బీజేపీ ప్రభుత్వంపై ఏమాత్రం విశ్వాసం లేదు. ఇప్పటి వరకు జరగని అప్రజాస్వామిక పనులు అన్నీ బీజేపీ హయాంలో జరగుతున్నాయి
లఖ్నవూ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల పాలిట డెత్ వారెంట్లని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నారు. బీజేపీ తప్పిదాల్ని ప్రశ్నించేవారిపై కేసులు పెడతారని, అవసరమైతే వారిని దేశద్రోహులుగా చిత్రించడానికి ఏమాత్రం వెనకడుగు వేయరని ఆయన అన్నారు. బీజేపీ రాజ్యం(పాలన)లో అన్యాయాలు, దారుణాలకు పరిమితి లేకుండా పోతోందని, దీనిపై పెద్ద పోరాటం చేయాలని పార్టీ కార్యకర్తల్ని ఉద్దేశించి అఖిలేష్ యాదవ్ అన్నారు.
పార్టీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ‘‘వచ్చే ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రజలకు బీజేపీ ప్రభుత్వంపై ఏమాత్రం విశ్వాసం లేదు. ఇప్పటి వరకు జరగని అప్రజాస్వామిక పనులు అన్నీ బీజేపీ హయాంలో జరగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వం బర్తరఫ్ అయితేనే ప్రజాస్వామ్యం బతుకుతుంది. బీజేపీ అధికారం కోల్పోతేనే దేశంలో సమాజంలో శ్రేయస్సు సాధ్యమవుతుంది. రైతులకు బీజేపీపై ఏమాత్రం నమ్మకం లేదు. రైతులకు అనుకూలంగా ఉండాల్సిన మండీలను కార్పొరేటర్లకు అనుకూలంగా మార్చారు. హత్రాస్ విషయంలో ప్రభుత్వాలు చెప్పిన అబద్ధాలు అందరికీ గుర్తున్నాయి. సమాజ్వాదీ అధికారంలోకి వస్తే హత్రాస్పై సిట్ దర్యాప్తు ఆదేశిస్తాం’’ అని అన్నారు.