పాండిచ్చేరిలో బల పరీక్ష నిర్వహించండి : అన్నాడీఎంకే డిమాండ్
ABN , First Publish Date - 2020-07-12T01:24:14+05:30 IST
నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ - డీఎంకే సర్కార్ మెజారిటీని కోల్పోయిందని అన్నా డీఎంకే
పాండిచ్చేరి : నారాయణ స్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ - డీఎంకే సర్కార్ మెజారిటీని కోల్పోయిందని అన్నా డీఎంకే సీనియర్ నేత అన్బజగన్ ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ధనవేలును అనర్హుడిగా ప్రకటించిన నేపథ్యంలో సర్కార్ మెజారిటీని కోల్పోయిందని పేర్కొన్నారు. వెంటనే బల పరీక్షకు సిద్ధం కావాలంటూ ముఖ్యమంత్రిని ఆదేశించాలని లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని ఆయన కోరారు.
అయితే నారాయణ స్వామి ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం తమకెంత మాత్రమూ లేదని ఆయన స్పష్టం చేశారు. ఇరు వర్గాల మధ్య ఉన్న అంతర్గత విభేదాల కారణంగానే ప్రభుత్వం కూలిపోతుందని జోస్యం చెప్పారు. కోవిడ్ను అరికట్టడంలో ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది కానీ.... ఓ ఎమ్మెల్యేపై మాత్రం అనర్హత వేటు వేయించిందని అన్బజగన్ ఎద్దేవా చేశారు.