ప్రియాంక గాంధీకి ఆగ్రా కలెక్టర్ నోటీసు
ABN , First Publish Date - 2020-06-24T01:32:32+05:30 IST
ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రా జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకి

ఆగ్రా : ఉత్తర ప్రదేశ్లోని ఆగ్రా జిల్లా కలెక్టర్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీకి మంగళవారం నోటీసు జారీ చేశారు. ఆసుపత్రిలో చేరిన 48 గంటల్లో 28 మంది కోవిడ్-19 రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు ట్వీట్ చేసినందుకు ఈ నోటీసు ఇచ్చారు. ఈ ఆరోపణలను 24 గంటల్లోగా ఉపసంహరించుకోవాలని కోరారు.
ప్రియాంక గాంధీ సోమవారం ఇచ్చిన ట్వీట్లో, ఆగ్రా నగరంలో ఆసుపత్రిలో చేరిన 48 గంటల్లో 28 మంది కోవిడ్-19 రోగులు ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొన్నారు. ఈ ట్వీట్కు ఓ మీడియా కథనాన్ని ఆమె జత చేశారు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఈ వాస్తవాన్ని మరుగుపరుస్తోందని, ఇది ప్రభుత్వానికి సిగ్గు చేటు అని పేర్కొన్నారు.
ప్రియాంక గాంధీ షేర్ చేసిన సమాచారం తప్పుడు సమాచారమని, తప్పుదోవ పట్టించే సమాచారమని ఆగ్రా జిల్లా కలెక్టర్ ప్రభు నారాయణ్ సింగ్ తెలిపారు. ఈ ఆరోపణలను 24 గంటల్లోగా ఉపసంహరించుకోవాలని ప్రియాంక గాంధీని కోరారు. ఈ ఆరోపణల ప్రభావం సామాన్యులపైనా, కోవిడ్-19పై పోరాడుతున్న యోధులపైనా ప్రతికూలంగా పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇదిలావుండగా, ప్రియాంక గాంధీ మంగళవారం కూడా యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆగ్రా మోడల్పై ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అబద్ధాలు ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. 48 గంటల్లోగా వాస్తవాలను బయటపెట్టాలని ముఖ్యమంత్రి యోగిని డిమాండ్ చేశారు.