కరోనా ముప్పు తొలగాలని అఘోరాల పూజలు
ABN , First Publish Date - 2020-04-10T13:59:45+05:30 IST
కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు తిరుచ్చి అరయమంగళం ప్రాంతంలో అర్థరాత్రి అఘోరాలు
చెన్నై : కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు తిరుచ్చి అరయమంగళం ప్రాంతంలో అర్థరాత్రి అఘోరాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుచ్చి జిల్లా అరియమంగళం ప్రాంతానికి చెందిన అఘోరీ మణికంఠన్ కాశీలో శిక్షణ పొందిన తర్వాత స్వస్థలంలో జయ అఘోరీ కాళికాదేవి విగ్రహాన్ని ప్రతిష్టించి రోజూ పూజలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా ప్రబలి ప్రజలంతా గృహనిర్బంధంలో గడుపుతుండటం చూసి చలించిపోయిన మణికంఠన్ అర్థరాత్రి ఆ కాళికాదేవి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు జరపాలని నిర్ణయించారు.
ఆ మేరకు అఘోరి మణి కంఠన్ సహా మరో ఆరుగురు అఘోరాలతో ప్రత్యేక పూజలకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు. బుధవారం అర్థరాత్రి నుంచి గురువారం వేకువజాము వరకూ అఘోరీలు ప్రత్యేక పూజలు చేశారుు. యాగగుండం వద్ద మణికంఠన్ తులసీ మాల పట్టుకుని మంత్రాలు చదువుతుండగా అఘోరీలు వంతుల వారీగా శీర్షానం వేశారు. అదే సమయంలో అఘోరీలు శంకాన్ని ఊదుతూ, డమరుకాన్ని వాయిస్తూ నృత్యం కూడా చేశారు.