అంతా సవ్యంగానే ఉన్నాయి... తేజస్వీ ఆరోపణలపై ఈసీ వివరణ
ABN , First Publish Date - 2020-11-13T18:18:48+05:30 IST
ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయన్న తేజస్వీ ఆరోపణలపై శుక్రవారం ఈసీ స్పందించింది. అభ్యర్థి తేజస్వీ యాదవ్ చేసిన ఆరోపణలను పరిగణనలోకి
పాట్నా : ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగాయన్న తేజస్వీ ఆరోపణలపై శుక్రవారం ఈసీ స్పందించింది. అభ్యర్థి తేజస్వీ యాదవ్ చేసిన ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్నామని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను, రిజెక్టెడ్ ఓట్లను కూడా తిరిగి లెక్కించామని, అంతా సవ్యంగానే ఉన్నట్లు తమ పరిశీలనలో తేలిందని బిహార్ ఎన్నికల సంఘం ప్రధానాధికారి శ్రీనివాస్ ప్రకటించారు. హిల్సా నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థి అత్రి మునిపై జేడీయూ అభ్యర్థి కేవలం 12 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో మొత్తం 551 పోస్టల్ ఓట్లు వస్తే... అందులో 182 ఓట్లు చెల్లనివిగా ఈసీ ప్రకటించింది. ‘‘పోస్టల్ ఓట్లను, ఈవీఎం ఓట్లను తిరిగి లెక్కించాలని ఆర్జేడీ డిమాండ్ చేసింది. అయితే మొదట్లో రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఎందుకంటే అక్కడే ఆర్జేడీ ఏజెంట్లు ఉన్నామనే తిరస్కరించాం. కానీ... అభ్యర్థిని సంతృప్తి పరచడానికి తిరిగి రీకౌంటింగ్ జరిపించాం. ఫలితాల్లో ఏమీ మార్పు లేదు.’’ అని శ్రీనివాస్ తెలిపారు. చివరిలో ఓట్ల లెక్కింపు జరిగిన అన్ని నియోజకవర్గాల్లోనూ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో అవకతవకలు చోటుచేసుకున్నాయని తేజస్వీ ఆరోపించారు. అక్కడ మళ్లీ వాటిని లెక్కబెట్టాలని ఆయన ఈసీని కోరారు.