తమిళనాడులో త్వరలో బీజేపీ పాలన : నమిత
ABN , First Publish Date - 2020-09-17T15:09:08+05:30 IST
తమిళనాడులో త్వరలో బీజేపీ అధికారం చేపడుతుందని నటి నమిత అభిప్రాయపడ్డారు.
![తమిళనాడులో త్వరలో బీజేపీ పాలన : నమిత](https://media.andhrajyothy.com/appimg/galleries/2020091709375190/09172020093847n79.jpg)
చెన్నై : తమిళనాడులో త్వరలో బీజేపీ అధికారం చేపడుతుందని నటి నమిత అభిప్రాయపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానికి ముందు అన్నాడీఎంకేలో చేరిన నమిత అనంతరం.. గత ఏడాది చివరలో బీజేపీ నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో, రాష్ట్ర కార్యాచరణ సభ్యురాలు పదవి దక్కింది. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీ 70వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర జాలర్ల సంఘం అధ్యక్షుడు సతీష్కుమార్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ఐస్హౌస్లో ప్రజలకు 370 కిలోల చేపలు పంపిణీ చేశారు.
ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న నమిత విలేకరులతో మాట్లాడుతూ, ‘నీట్’ పరీక్షకు భయపడి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడరాదని, అలాంటి వారు ఒక్కసారి తమ తల్లిదండ్రుల గురించి ఆలోచించాలని కోరారు. అలాగే, మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు ధ్యానం చేయాలని ఆమె విద్యార్థులకు పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే ప్రశ్నకు నమిత బదులిస్తూ, ఆ విషయం ప్రస్తుతం అవసరం లేదని ఆమె బదులిచ్చారు.