ముస్లిం విద్యాశాఖ మంత్రులంతా.. భారతదేశ చరిత్రను వక్రీకరించారు
ABN , First Publish Date - 2020-07-28T07:27:26+05:30 IST
భారత దేశ చరిత్రను ముస్లిం వర్గానికి చెందిన విద్యాశాఖ మంత్రులంతా వక్రీకరించారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వర్రావు ఆరోపించారు. చరిత్రను భ్రష్టుపట్టించడంలో....
![ముస్లిం విద్యాశాఖ మంత్రులంతా.. భారతదేశ చరిత్రను వక్రీకరించారు](https://media.andhrajyothy.com/appimg/galleries/202007281949/07282020185103n98.jpg)
వారిలో ఆద్యుడు అబుల్ కలామ్ ఆజాద్
ఐపీఎస్ అధికారి నాగేశ్వర్రావు ఆరోపణ
న్యూఢిల్లీ: భారత దేశ చరిత్రను ముస్లిం వర్గానికి చెందిన విద్యాశాఖ మంత్రులంతా వక్రీకరించారని సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం.నాగేశ్వర్రావు ఆరోపించారు. చరిత్రను భ్రష్టుపట్టించడంలో మౌలానా అబు ల్ కలామ్ ఆజాద్ వారికి ఆద్యుడని తెలిపారు. భారతదేశ చరిత్రను నెగటివ్గా చూపిస్తూ.. ముస్లిం దండయాత్రలను గొప్పగా ప్రచారం చేశారని మండిపడ్డారు. స్వాతంత్ర్యానంతరం 30 ఏళ్లలో చరిత్రపై దాడి జరిగిందని వివరించారు. నాగేశ్వర్రావు ఈ నెల 31న పదవీ విరమణ పొందనున్నారు. ఈ తరుణంలో ట్విటర్లో ఈ సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సీబీఐలో తా త్కాలిక డైరెక్టర్గా పనిచేసిన ఆయన.. ప్రస్తుతం హోం గార్డ్స్ డైరెక్టర్ జనరల్గా సేవలందిస్తున్నారు. ‘అప్పటి విద్యాశాఖ మంత్రులంతా ఇండియన్ మైండ్ స్పేస్ కార్యక్రమానికి ఇన్చార్జిలుగా ఉంటూ.. హిందూ చరిత్రను పుస్తకాల నుంచి పెకిలించేశారు. ఆజాద్ 11 ఏళ్లు విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత హుమయూన్ కబీర్, ఎంసీ చగల, ఫక్రుద్దీన్ అలీ అహ్మ ద్, నూరుల్ హుస్సేన్ చరిత్ర వక్రీకరణ కుట్రలో పాలు పంచుకున్నారు. ఆ తర్వాత కమ్యూనిస్టు మంత్రులు ఆ బాధ్యతలను భుజాలకెత్తుకున్నారు’ అని దుమ్మెత్తి పోశారు.