ఉచితంగా కోవిడ్-19 చికిత్స చేయాలన్న పిల్ తిరస్కృతి
ABN , First Publish Date - 2020-04-22T02:24:53+05:30 IST
ఉచిత చికిత్స ఎవరికి అందజేయాలో నిర్ణయించవలసినది ప్రభుత్వమేనని

న్యూఢిల్లీ : ఉచిత చికిత్స ఎవరికి అందజేయాలో నిర్ణయించవలసినది ప్రభుత్వమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్-19 మహమ్మారి అదుపులోకి వచ్చే వరకు ఈ వ్యాధి సోకినవారికి పరీక్షలు, చికిత్స ఉచితంగా అందజేయాలని కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ బీఆర్ గవాయ్ సుప్రీంకోర్టు దర్మాసనం ఈ పిల్పై మంగళవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణ జరిపింది. పిల్ను ప్రచార ప్రయోజన వ్యాజ్యంగా మార్చవద్దని పిటిషనర్ను ధర్మాసనం సున్నితంగా హెచ్చరించింది.
ఢిల్లీకి చెందిన న్యాయవాది అమిత్ ద్వివేది ఈ పిల్ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ ఎవరికి ఉచితంగా చికిత్స అందజేయాలో నిర్ణయించవలసినది ప్రభుత్వమేనని చెప్పారు. తమ వద్ద ఎటువంటి నిధులు లేవన్నారు.
కరోనా వైరస్ సోకినవారికి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఉచిత చికిత్సను అందజేస్తున్నాయని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసును మూసివేయవచ్చునని భావిస్తున్నట్లు తెలిపింది.
కేంద్ర, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు, సంబంధిత సంస్థలను కోవిడ్-19 మహమ్మారి అదుపులోకి వచ్చే వరకు జాతీయం చేయాలని ఆదేశించాలని ద్వివేది చేసిన అభ్యర్థనపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది.
కేంద్ర ప్రభుత్వం తన వాదనలో ప్రజలందరికీ తగిన ఆరోగ్య సదుపాయాలు కల్పించేందుకు సరైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది.