కర్ణాటకలో కరోనా కల్లోలం.. ఒక్క బెంగళూరులోనే..
ABN , First Publish Date - 2020-07-20T03:22:59+05:30 IST
కర్ణాటకలో కరోనా కేసులు ఇవాళ కూడా భారీగానే నమోదయ్యాయి. కర్ణాటకలో ఇవాళ ఒక్కరోజే...

బెంగళూరు: కర్ణాటకలో కరోనా కేసులు ఇవాళ కూడా భారీగానే నమోదయ్యాయి. కర్ణాటకలో ఇవాళ ఒక్కరోజే 4120 కరోనా కేసులు నమోదయినట్లు ఆ రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇవాళ నమోదైన కరోనా కేసుల్లో ఒక్క బెంగళూరులోనే 2156 పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలిపింది. దీంతో.. కర్ణాటకలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 63,772కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసుల సంఖ్య 39,370. మరణాల సంఖ్య కూడా కర్ణాటకను కలవరపాటుకు గురిచేస్తోంది.
కర్ణాటకలో ఆదివారం ఒక్కరోజే కరోనా వల్ల 91 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 1331కి చేరింది. ఇదిలా ఉంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు తర్వాత కర్ణాటకలోనే ఎక్కువ కరోనా కేసులు నమోదవుతుండగా.. ఆదివారం ఈ రెండు రాష్ట్రాల కంటే ఎక్కువ కరోనా కేసులు ఆంధ్రప్రదేశ్లో నమోదు కావడం గమనార్హం. ఏపీలో ఆదివారం ఒక్కరోజే 5,041 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం.